ఢిల్లీలో రూ.85 దాటిన పెట్రోల్ ధరలు, ముంబైలో రూ.92
ఢిల్లీ: పెట్రోల్ ధరలు దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త గరిష్టాన్ని తాకాయి. మంగళవారం (జనవరి 19) లీటర్ పెట్రోల్ రూ.85 దాటింది. చమురు ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రెండు కూడా లీటర్ పైన 25 పైసలు పెరిగాయి. నిన్న కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల చొప్పున పెరిగాయి. అంతకుముందు వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు గత బుధవారం 25 పైసల చొప్పున పెరిగాయి. ఇప్పుడు వరుసగా రెండు రోజులు పెరిగాయి.
అప్పటి నుండి ఎంత పెరిగాయంటే
గత ఏడాది డిసెంబర్ ప్రారంభంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నెల రోజుల పాటు స్థిరంగా ఉన్నాయి. ఆ తర్వాత జనవరి 6న చమురు రంగ కంపెనీలు పెంచాయి. ఫ్యూయల్ రిటైలర్స్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) ధరలను పెంచాయి. ఈ నెలలో ఇప్పటి వరకు పెట్రోల్ పైన రూ.1.49 పైసలు, డీజిల్ పైన రూ.1.51 పైసలు పెరిగింది. జనవరి 13, 14 తేదీల్లో రెండు విడతలుగా 50 పైసల చొప్పున పెరిగింది. వారంలో రూపాయి పెరిగింది.
గరిష్టం ఎప్పుడంటే
గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గడం, భారత్ సహా వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ నేపథ్యంలో డిమాండ్ పెరుగుతుందనే అంచనాలకు తోడు చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకున్నాయి. దీంతో చమురు ధరలు ఇటీవల పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పెరుగుదలకు అనుగుణంగా చమురు రంగ కంపెనీలు ధరలు సవరిస్తున్నాయి. గతంలో 2018 అక్టోబర్ 4న ధరలు గరిష్టాన్ని తాకాయి.
వివిధ నగరాల్లో ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.20, డీజిల్ రూ.75.38కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ ధర అత్యధికంగా రూ.91.80కి చేరింది. పెట్రోల్ చెన్నైలో రూ.87.85, కోల్కతాలో రూ.86.63 కాగా, డీజిల్ ధర ముంబైలో రూ.82.13, చెన్నైలో రూ.80.67, కోల్కతాలో రూ.78.97గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ నేడు 26 పైసలు పెరిగి రూ.88.63, డీజిల్ 27 పైసలు పెరిగి రూ.82.26గా ఉంది.