అక్కడ మళ్లీ రూ.100 దాటిన పెట్రోల్ ధరలు: ఏ నగరంలో ఎంతంటే
పెట్రోల్, డీజిల్ ధరలు మొన్నటి వరకు వరుసగా నాలుగు రోజులు పెరిగాయి. మంగళవారం నుండి పెరుగుతున్న ధరలు శుక్రవారం వరకు స్వల్పంగా పెరిగాయి. శనివారం, ఆదివారం యథాతథంగా ఉన్నాయి. అంటే వరుసగా రెండు రోజులు ధరల్లో మార్పులేదు. అంతకుముందు 18 రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు ఆ తర్వాత ఆరు రోజుల క్రితం స్వల్పంగా పెరిగాయి. దేశీయ చమురురంగ కంపెనీలు అంతకుముందు 15 ఏప్రిల్, 30 మార్చిన ధరలను తగ్గించాయి.
రూ.100 మార్కు దాటిన పెట్రోల్
శుక్రవారం రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.102.15కు పెరిగింది. మధ్యప్రదేశ్లోని అన్నుపూర్లో రూ.10186కు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత పెట్రోల్ ధరలు రూ.100 మార్క్ దాటడం ఇది రెండోసారి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) అధికంగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి మారుతాయి. బ్రెంట్ క్రూడ్ ధర ప్రస్తుతం 70 డాలర్లకు సమీపంలో ఉంది.
వివిధ నగరాల్లో ధరలు
చివరిసారి అంటే శుక్రవారం లీటర్ పెట్రోల్ పైన 28 పైసలు, డీజిల్ పైన 31 పైసలు పెరిగింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ చమురురంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ 28 పైసలు పెరిగి రూ.91.27, లీటర్ డీజిల్ 31 పైసలు పెరిగి రూ.81.73 వద్ద ట్రేడ్ అయింది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.61, లీటర్ డీజిల్ రూ.88.82, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.93.15, లీటర్ డీజిల్ రూ.86.65, కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.91.41, లీటర్ డీజిల్ రూ.84.57గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.94.68, లీటర్ డీజిల్ రూ.89.11గాఉంది. ఈ నాలుగు రోజుల్లో పెట్రోల్ లీటర్కు 87 పైసలు, డీజిల్ రూ.1 పెరిగింది.
పన్నులు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన కేంద్ర పన్నులు రూ.32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ రూ.19.55గా ఉంది. డీజిల్ విషయానికి వస్తే లీటర్ పైన ఎక్సైంజ్ డ్యూటీ రూ.31.83 కాగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూ.10.99గా ఉంది. వీటతో పాటు డీలర్ కమిషన్ పెట్రోల్ పైన రూ.2.6, డీజిల్ పైన రూ.2గా ఉంది.