పెట్రోల్, డీజిల్ రేట్లల్లో నెలకొన్న తాజా పరిస్థితేంటీ? వాటి ధరలను మళ్లీ సవరించారా?
న్యూఢిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తరువాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉంటున్నాయి? రోజురోజుకూ వాటి రేట్లల్లో సవరణలు చోటు చేసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజా రేట్ల వివరాలు ఎలా ఉన్నాయి? ఇదివరకు వాహనదారులను చుక్కలు చూపెడుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయా?, పెరుగుతున్నాయా? అనే ప్రశ్నలు వాహనదారుల్లో తలెత్తుతున్నాయి. రోజువారీ సవరణ వల్ల ఏరోజుకారోజు ధరల గురించి తెలుసుకోవాల్సిన వస్తోంది.
కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండట్లేదు. వాటి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్ లీటర్ ఒక్కింటికి16 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 14 పైసల మేర తగ్గాయి. అప్పటి నుంచి అవే ధరలు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి. శనివారం నాడు కూడా పాత రేట్లే నమోదయ్యాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన వివరాల ప్రకారం దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.90.46 పైసలు, డీజిల్ రూ.80.73 పైసలకు చేరింది.
ముంబైలో పెట్రోలు రేటు 96.83, డీజిల్ ధర 87.81 పైసలుగా రికార్డయింది. చెన్నైలో పెట్రోలు రూ. 92.43, డీజిల్ ధర రూ. 85.75, కోల్కతలో పెట్రోలు రూ.90.62 పైసలు, డీజిల్ ధర రూ.83.61 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్-92.74, డీజిల్-85.97, నొయిడాలో పెట్రోల్-88.79, డీజిల్-81.19, భోపాల్లో పెట్రోల్-98.41, డీజిల్-88.98గా రికార్డయ్యాయి. బెంగళూరులో పెట్రోల్-93.43, డీజిల్-85.60, చండీగఢ్ పెట్రోల్-86.99, డీజిల్-85.97, లక్నో-88.72, డీజిల్-81.13 పైసలుగా నమోదయ్యాయి.
కాగా- పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇంకా మిగిలి ఉంది. ఇంకో రెండు దశల్లో పోలింగ్ కొనసాగాల్సి ఉంది. చివరి విడత పోలింగ్ ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వచ్చేనెల 2వ తేదీన ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే.. ఈ నెల చివరన లేదా వచ్చేనెల మొదటి వారంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా హెచ్చుతగ్గులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది.