హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు నిన్న ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఈ నెలలో చమురు ధరలు నాలుగో రోజు పెరిగాయి. నిన్న (23 జనవరి 2021) ధరలు లీటర్ పైన 25 పైసల చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్ సహా పలు నగరాల్లో గరిష్టస్థాయిని తాకాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండు రోజులు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.92.28, దేశ రాజధాని ఢిల్లీలో రూ.85.70కి పెరిగింది. డీజిల్ లీటర్ పైన ముంబైలో రూ.82.66తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది.
చెన్నై, కోల్కతాలో పెట్రోల్ ధరలు వరుసగా రూ.88.29, 87.11 కాగా, డీజిల్ ధరలు రూ.81.14, రూ.79.48గా ఉంది. హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు గత 26 సంవత్సరాల్లో ఎన్నడూ లేనిస్థాయికి చేరుకున్నాయి. శనివారం పెట్రోల్ పైన 26 పైసలు, డీజిల్ పైన 27 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.89.15, డీజిల్ రూ.82.80కి చేరుకుంది.
2018 నవంబర్ నెలలో ఉన్న లీటర్ పెట్రోల్ ధర రూ.89.06, డీజిల్ రూ.82.53. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. నిన్న ఆ దానిని దాటి సరికొత్త గరిష్టాన్ని తాకాయి. కరోనా అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. జనవరి తొలి 21 రోజుల్లో 9.65 కోట్ల లీటర్ల పెట్రోలు, 18.73 కోట్ల లీటర్ల డీజిల్ విక్రయం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు పెట్రోల్ దాదాపు పది శాతం, డీజిల్ దాదాపు ఏడు శాతం అధికంగా విక్రయం జరిగింది.