వరుసగా 7వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: అక్కడ రూ.100 క్రాస్
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడవ రోజు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయ చమురురంగ కంపెనీలు ధరలను పెంచాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ 26 పైసలు పెరిగి రూ.88.99, లీటర్ డీజిల్ 29 పైసలు పెరిగి రూ.79.35గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధరలు రికార్డ్స్థాయిలో రూ.95ను దాటాయి. పలు మెట్రో నగరాల్లో ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఇటీవల చమురు ధరలు వరుసగా షాకిస్తున్నాయి.
ATMను తాకకుండానే డబ్బులు ఉపసంహరణ
అక్కడ రూ.100 దాటిన పెట్రోల్
వరుసగా ఏడో రోజు పెరిగిన అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.89కి సమీపంలో ఉంది. ఇక్కడ పెట్రోల్ రూ.88.99గా ఉంది. ముంబైలో రూ.95, కోల్కతాలో రూ.90.25, బెంగళూరులో రూ.91.97, హైదరాబాద్లో రూ.92.53, పాట్నాలో రూ.91.67, తిరువనంతపురంలో రూ.90.87గా ఉంది.
కోల్కతాలో మొదటిసారి రూ.91 మార్కు క్రాస్ చేసింది. మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో పెట్రోల్ ధర రూ.100 క్రాస్ చేసింది. లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ నేపథ్యంలో ఇక్కడ పెట్రోల్ ధర ఎక్కువగా ఉంటుంది.
డీజిల్ ధరలు ఇలా...
లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ.79.35గా ఉంది. కోల్కతాలో రూ.82.94, ముంబైలో రూ.86.34, చెన్నైలో రూ.84.44, బెంగళూరులో రూ.84.12, ఒడిశా రాజధాని భువనేశ్వర్లో రూ.86.63, హైదరాబాద్లో రూ.86.55, జైపూర్లో రూ.87.76, పాట్నాలో రూ.84.84, తిరువనంతపురంలో రూ.85.30గా ఉంది.
సామాన్యుడిపై భారం
ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్యుడిపై ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు 60 డాలర్లు దాటింది. దీంతో ఇక్కడ కూడా ధరలు పెరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు జనవరి 6, 2021 నుండి పెరుగుతున్నాయి.
ప్రపంచ దేశాలు కరోనా నుండి క్రమంగా కోలుకోవడం, ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడం వంటి వివిధ కారణాలతో ఇంధన డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇంధన ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సమీక్షిస్తాయి.