పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయి, ద్రవ్యోల్భణ ఆందోళనలు
రష్యా-ఉక్రెయిన్ యద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఆ తర్వాత కాస్త శాంతించినప్పటికీ నాలుగు నెలల క్రితం ధరలతో పోలిస్తే 30 డాలర్లకు పైగా ఎగిసిపడింది. వివిధ దేశాల్లో ఇప్పటికే ధరలు భారీగా పెరిగాయి. అయితే మన దేశంలో నవంబర్ ప్రారంభ వారంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ పైన సుంకం తగ్గించి, సామాన్యులకు ఊరట కల్పించిన అనంతరం ఇప్పటి వరకు ధరలు పెరగలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పెరుగుతాయని భావించినప్పటికీ, పది రోజులకు పైగా స్థిరంగానే ఉన్నాయి. అయితే నిన్నటి నుండి ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు, కేంద్రం సామాన్యులపై భారం పడకుండా ఉండేలా రష్యా నుండి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు 137 రోజుల తర్వాత వరుసగా రెండు రోజుల పాటు 80 పైసల చొప్పున పెంచాయి.
అందుకే ధరలు పెరిగాయి
ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం సాధారణంగా గత పదిహేను రోజుల అంతర్జాతీయ బెంచ్ మార్క్ ధరల రోలింగ్ యావరేజ్ ఆధారంగా ప్రతిరోజు రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. భారీ వినియోగదారులకు విక్రయించే ఇంధనం, విమానయాన టర్బైన్ ఇంధనం ధరలు పెంచబడినప్పటికీ, ముడి చమురు ధరలు బాగా పెరిగినప్పటికీ దాదాపు 137 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. డీజిల్ ధరలు చివరిసారి నవంబర్ 2వ తేదీన పెరిగాయి. పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. నవంబర్ 4వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. అప్పుడు ముడి చమురు ధరలు బ్యారెల్కు 80 డాలర్లు మాత్రమే. కానీ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ మార్చి 7న బ్యారెల్కు 139 డాలర్లు క్రాస్ చేసింది. జూలై 2008 నుండి ఇదే అత్యధికం. క్రూడ్ ధరలు ఇప్పుడు 118 డాలర్ల వద్ద ఉన్నాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితంతో పోలిస్తే దాదాపు 40 డాలర్లు పెరిగింది. దీంతో ధరలు పెంచవలసి వచ్చింది.
ఎంత వరకు పెరగవచ్చు?
ముడి చమురు ధరలు 1 డాలర్ పెరిగితే రిటైల్ ఇంధన ధరలు లీటర్ పైన 50 పైసల నుండి 60 పైసలు పెరుగుతాయని పరిశ్రమ నిపుణుల అంచనా. నవంబర్ నుండి బ్యారెల్ ముడి చమురు ధరలు 40 డాలర్ల వరకు పెరిగాయి. అంటే రూ.20 వరకు పెరవగచ్చునని అంచనా. ఇప్పటికే బల్క్ డీజిల్ ధర రూ.25 పెంచారు. అయితే సామాన్యులపై భారం మోపకుండా ఒకేసారి పెంచకుండా, క్రమంగా పెంచుతారని అంటున్నారు.
ద్రవ్యోల్భణంపై ప్రభావం
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ద్రవ్యోల్భణంపై ఉంటాయి. పెరుగుతున్న చమురు ధరల కారణంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగి, ఇది ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. FY21లో సగటు ద్రవ్యోల్భణం 6.1 శాతం నుండి 6.3 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీనిని మైనస్ ఆర్ ప్లస్ 4 శాతంగా అంచనా వేస్తోంది ఆర్బీఐ. కానీ చమురు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.