పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సిద్ధంగా ఉండండి..!
మీరు వాహన వినియోగదారులా? అయితే మీకో చేదువార్త. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం భారత్ ప్రామాణిక బ్రెంట్ క్రూడ్ ధర 127 డాలర్లకు పైన, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 1.22 డాలర్లకు పైన ఉంది. గతవారం బ్రెంట్ ఓ సమయంలో 130 డాలర్లను క్రాస్ చేసింది. నాలుగు నెలలుగా మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. అయితే ఇప్పడు ఎన్నికలు పూర్తయిన కారణంగా ఇక ధరలు పెంచడమే తరువాయి.
దీపావళి సమయంలో క్రూడ్ ధరలు 70 డాలర్లకు పైన ఉన్నాయి. ఈ కాలంలో ద్రవ్యోల్భణ భయాలు, యుద్ధం కారణంగా ఏకంగా రెండింతలు పెరిగి 130 డాలర్లను తాకింది. దీంతో మన వద్ద పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. అయితే ఈ ధరల పెంపు క్రమంగా ఉండనుంది.
దిగుమతులే అధికం
మొత్తానికి వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు సిద్ధంగా ఉండాలి. భారత్ ఓవర్సీస్ చమురు దిగుమతులు 85 శాతానికి పైగా ఉన్నాయి. మనం దిగుమతుల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నందున అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలు ఈవారమే పెరగనున్నాయి. అది కూడా రేపో, మాపో పెరిగే అవకాశముంది.
ఇటీవల బ్యారెల్ చమురు 140 డాలర్లను తాకి, కిందకు వచ్చింది. పదమూడేళ్లలోనే ఇది గరిష్టం. జూలై 8, 2008 నుండి బ్రెంట్ క్రూడ్ మొదటిసారి ఇటీవల 139.13 డాలర్లను తాకింది.
60 శాతం పెరుగుదల
అంతర్జాతీయంగా చమురు ధరలు 2022 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటికే 60 శాతం వరకు పెరిగాయి. మనకు దిగుమతి భారమై, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు. మరోవైపు, డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్షీణిస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరమే. ఇది ద్రవ్యోల్భణం పెరగడానికి కూడా కారణమవుతుందని ఆందోళన వ్యస్తమవుతోంది.
ఎంత పెరగవచ్చు
2017 నుండి పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మారుతున్నాయి. అయితే నవంబర్ 4, 2021 నుండి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్చి 1వ తేదీ నుండి భారత్ బ్యారెల్ చమురును 111 డాలర్లకు కొనుగోలు చేస్తోంది. అంతకుముందు నాలుగు నెలలుగా సగటున ఇది 81.5 డాలర్లుగా ఉంది. ఇప్పుడు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు. లీటర్ పెట్రోల్ పైన మనవద్ద రూ.15 నుండి రూ.20 వరకు పెరగవచ్చునని అంచనా.