అప్పుడే పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాలేం: నిర్మల
పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు ఇది సరైన సమయం కాదని జీఎస్టీ మండలి భావించిందని, అందుకే వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇదే విషయాన్ని తాము హైకోర్టుకు విన్నవిస్తామన్నారు. జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పలు అంశాలపై సుదీర్ఘకంగా చర్చించిన అనంతరం, పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
ఈ నెలాఖరుతో ముగిసే కరోనా మెడిసిన్స్ పైన జీఎస్టీ రాయితీని డిసెంబర్ చివరి వరకు కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే కొవిడ్ చికిత్సకు ఉపకరించే కొన్ని వైద్య పరికరాలకు మాత్రం ఈ రాయితీ పొడిగింపు వర్తించదు. వాటిపై ఉన్న పన్ను రాయితీ ఈ నెలాఖరుతో ముగియనుంది. కండరాల క్షీణత వ్యాధుల చికిత్సలో ఉపయోగించే అత్యంత ఖరీదైన ఔషధాలకు జీఎస్టీ నుండి మినహాయింపు ఇచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
అందుకే చర్చ
ఇక పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశాన్ని పక్కన పెట్టింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై ఎలాంటి అంగీకారం కుదరలేదు. అధిక పన్ను రాబడి ఇచ్చే పెట్రోఉత్పత్తులను జీఎస్టీలో తెచ్చే ప్రతిపాదనను రాష్ట్రాలు వ్యతిరేకించాయి. దీంతో ఈ ప్రతిపాదనపై పెద్దగా చర్చ జరగలేదని తెలుస్తోంది. అయితే కేరళ హైకోర్టు సూచనల మేరకే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై చర్చ జరిగిందని, ఈ అంశాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించటమే కాకుండా ప్రస్తుతం ఇది సమయం కాదని నిర్మలా సీతారామన్ తెలిపారు.
పెట్రోల్, డీజిల్ బేస్ ధర
సాధరణంగా పెట్రోల్ బేస్ ధర రూ.40 సమీపంలో ఉంది. వ్యాట్, డీలర్ కమిషన్, ఎక్సైజ్ డ్యూటీ వంటి ఛార్జీలు రూ.60కి పైగా ఉన్నాయి. అంటే అరవై శాతానికి పైగా పన్నులు ఉన్నాయి. ఈ పన్నుల్లో కొంత మొత్తం కేంద్రానికి, ఇంకొంత మొత్తం రాష్ట్రాలకు చేరుతుంది. పన్నుల వాటా అధికంగా ఉండటంతో పెట్రోల్ సామాన్యుడి వద్దకు చేరుకునేసరికి లీటర్ పైన రూ.100 దాటింది. కొన్నిచోట్ల రూ.110 కూడా ఉంది. ఇక డీజిల్ రూ.100కు చేరువలో ఉంది. డీజిల్ బేస్ ధర కూడా దాదాపు పెట్రోల్ అంతనే ఉంటుంది.
ఎంత తగ్గవచ్చు
ఆయా రాష్ట్రాల్లో వ్యాట్ ధరల తేడా ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ కిందకు తెస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయనే వాదనలు ఉన్నాయి. జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే గరిష్ట స్లాబ్ 28 శాతంగా ఉంది. జీఎస్టీ పరిధిలోకి వస్తే పెట్రోల్ బేస్ ధర రూ.40 వద్ద 28 శాతం స్లాబ్ ప్రకారం పెట్రోల్ ధర పైన పన్ను వాటా రూ.12 వరకు ఉంటుంది.
అప్పుడు పెట్రోల్ ధర రూ.52 వరకు ఉంటుంది. దీనికి డీలర్ కమిషన్ రూ.2 లేదా రూ.3 కలిపితే రూ.55 వరకు చేరుకోవచ్చు. అలాగే డీజిల్ ధర రూ.50కి చేరుకోవచ్చు. అయితే జీఎస్టీ ధరలను సవరించి, దీని పరిధిలోకి తెస్తే మాత్రం రూ.70 నుండి రూ.80 వరకు ఉండవచ్చుననే వాదనలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి కేంద్రం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించడం సమస్యగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువగా వచ్చే ఆదాయం మద్యం, పెట్రోల్ వంటి వాటి నుండే. కాబట్టి ఈ ఆదాయాన్ని కోల్పోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. పెట్రో ఉత్పత్తుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏడాదికి రూ.5 లక్షల కోట్లు వస్తోంది. ఇందులో రాష్ట్రాల వాటా రూ.2 లక్షల కోట్లకు పైగా ఉంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వాలకు ఆదాయం సమకూరుతుంది. కానీ ఇప్పుడు వచ్చే దానితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ధరలు 30 శాతం నుండి 40 శాతం వరకు తగ్గుతాయని భావిస్తున్నారు.