ఏపీ, తెలంగాణ సహా: పెట్రోల్ బంక్ ఓనర్ల నిరసన: ఇంధన కొరత
న్యూఢిల్లీ: ఏడాది వ్యవధిలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశానికి ఎగబాకాయి. గత ఏడాది మే నుంచే ఇంధన రేట్లు పెరగడం మొదలుపెట్టాయి. వాటి పెరుగుదల రోజుల తరబడి సాగింది. నవంబర్ వరకు అడ్డుకట్ట అనేదే పడలేదు. ఫలితంగా అనేక నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి రికార్డు స్థాయిలో 120 రూపాయలను టచ్ చేసింది. డీజిల్ పరిస్థితీ అంతే. నవంబర్లో దీపావళి పండగను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై అమలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తరువాతే వాహనదారులకు కాస్తంత ఉపశమనం కలిగింది.
ఈ ఏడాది కూడా..
ఈ ఏడాది మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. గత ఏడాది తరహాలో రోజుల తరబడి కాకపోయినప్పటికీ.. రెండు వారాల పాటు నిరాటంకంగా ఇంధన ధరలు పెరగడం వల్ల మళ్లీ పాత పరిస్థితులు తలెత్తాయి. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ 120 రూపాయల బెంచ్ మార్క్ను కూడా దాటేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు గత ఏడాది వ్యాట్ను తగ్గించిన రాష్ట్రాల్లో మాత్రమే కొంత మేరకు వాటి ధరల్లో తేడా కనిపించింది.
పెంపుదల ఆ రకంగా..
ఇప్పుడు మళ్లీ అదే కేంద్ర ప్రభుత్వం ఇంధన అమ్మకాలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఈ ఏడాదికాలంలో చోటు చేసుకున్న పెంపు వల్ల పెట్రోల్ ధర 100 రూపాయలకు అటుఇటుగా ఉంటోంది. ఇప్పుడీ పెరుగుదలే- దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల యజమానుల సామూహిక నిరసనలకు కారణమైంది. తమ కమీషన్ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచట్లేదనేది వారి ఆవేదన. దీనికి నిరసనగా వారు ఇవ్వాళ నో పర్ఛేజ్ డే పాటిస్తున్నారు.
పాత కమీషన్తోనే..
ఇందులో భాగంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ను కొనట్లేదు. ఇంధన రేట్ల పెంపుదలలో చూపించిన శ్రద్ధ.. కమీషన్ పెంపుపై పెట్టలేదని ఆరోపిస్తోన్నారు. పాత కమీషన్ మొత్తమే ఇంకా కొనసాగుతోందని, దీన్ని సవరించాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. పట్టించుకోవట్లేదని ఢిల్లీ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ నారాయణ్ తెలిపారు. దీనికి నిరసనగా తాము నో పర్ఛేజ్ డే గా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
2017 నుంచి
2017 నుంచీ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీలర్ల కమీషన్లో ఎలాంటి పెంపుదల ఉండట్లేదని ఆయన అన్నారు. అప్పటితో పోల్చుకుంటే ఇంధన ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయని, అయినప్పటికీ.. తమ కమీషన్లో ఎలాంటి సవరణలు చేయట్లేదని చెప్పారు. దీనికి నిరసనగా ఇవ్వాళ తాము ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ను కొనకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిరసనలో పాల్గొనడానికి 24 రాష్ట్రాలకు చెందిన పెట్రోల్ డీలర్ల అసోసియేషన్లు ముందుకు వచ్చాయని వివరించారు.
పాల్గొన్న రాష్ట్రాలివే..
ఈ నిరసనలో భాగంగా ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, బిహార్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నార్త్ బెంగాల్ డీలర్స్ అసోసియేషన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్కు చెందిన పెట్రోల్ డీలర్ల అసోసియేషన్లు ఇవ్వాళ ఇంధనాన్ని కొనట్లేదు. దీని ఫలితం వాహనదారులపై పడే అవకాశం ఉంది. ఆయా రాష్ట్రాల్లోని బంకుల్లో పెట్రోల్ దొరికినంతే అందుబాటులో ఉంటుంది.