2 రాష్ట్రాల్లో రూ.100 దాటిన పెట్రోల్: క్రూడ్ నాటి కంటే తక్కువ ఉన్నా ధరలు ఎందుకిలా పెరిగాయి?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదో రోజు పెరిగాయి. చమురు ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నేడు (ఫిబ్రవరి 18 గురువారం) లీటర్ డీజిల్ పైన 32 పైసలు, లీటర్ పెట్రోల్ పైన 34 పైసలు పెరిగింది. ఇప్పటికే రాజస్తాన్లో రూ.100 క్రాస్ చేసిన రెగ్యులర్ పెట్రోల్ ధర తాజాగా మధ్యప్రదేశ్లోను దాటింది. బ్రాండెడ్ లేదాఅడిక్టివ్ లేస్డ్ పెట్రోల్ (అధిక ట్యాక్స్) ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోని పలు నగరాల్లో రూ.100 దాటింది. రెగ్యులర్ పెట్రోల్ బుధవారం రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో రూ.100 క్రాస్ చేయగా, గురువారం మధ్యప్రదశ్లో దాటింది.
అందుకే ఈ రాష్ట్రాల్లో ధరలు రూ.100 క్రాస్
తాజా పెరుగుదలతో మధ్యప్రదేశ్లోని అనుప్పూర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100.25 పలికింది. లీటర్ డీజిల్ రూ.90.35 వద్ద ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, వ్యాట్ తదితర అంశాలపై ఆధారపడి పెట్రోల్, డీజిల్ ధరలు వివిధ రాష్ట్రాల్లో స్వల్పంగా మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఇంధనంపై అత్యధిక వ్యాట్ విధిస్తోంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ విధిస్తోంది. దీంతో ఈ రాష్ట్రాల్లో రెగ్యులర్ పెట్రోల్ ధరలు రూ.100ను క్రాస్ చేశాయి. లీటర్ పెట్రోల్ పైన మధ్యప్రదేశ్ 33 శాతం ప్లస్ రూ.4.5 పన్ను, 1 శాతం సెస్ విధిస్తోంది. డీజిల్ పైన 23 శాతం ప్లస్ రూ.3 పన్నును, 1 శాతం సెస్ విధిస్తోంది.
వివిధ నగరాల్లో..
తాజా సవరణ అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.89.88, డీజిల్ రూ.80.27, ముంబైలో పెట్రోల్ రూ.96.32, డీజిల్ రూ.87.32గా ఉంది. లీటర్ పెట్రోల్ కోల్కతాలో రూ.91.11, డీజిల్ రూ.83.86, ముంబైలో పెట్రోల్ రూ.96.32, డీజిల్ రూ.87.32, హైదరాబాద్లో పెట్రోల్ రూ.93.45, డీజిల్ రూ.87.55గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా చమురు రంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు ఇలా
దక్షిణాసియాలో పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక పన్నులు వేస్తోంది భారత దేశమే. ఇందులో కేంద్రం వాటాతో పాటు రాష్ట్రాల వ్యాట్ వాటా కూడా ఉంటుంది. గతంలో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు పలుమార్లు ఎక్సైజ్ డ్యూటీని పెంచారు. ఒకసారి మాత్రమే తగ్గించారు. దీంతో పన్ను అంతకంతకూ పెరిగింది. మన దేశంలో పెట్రోల్ రూ.100 దాటడానికి ఎక్సైజ్ పన్నులే ప్రధాన కారణం. కేంద్రం ఎక్సైజ్ సుంకానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ వసూలు చేస్తాయి. ఈ పన్నును తగ్గించాలని కేంద్రం సూచించినా రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తగ్గించలేదు. అందుకే ఇక్కడ మొదట రూ.100 క్రాస్ చేసింది.
అందుకే ధరలు జంప్
కరోనా సమయంలో చమురుకు డిమాండ్ పడిపోయి అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. దీంతో అప్పుడు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. పెట్రోల్ పైన 31.93 శాతం నుండి 32.98 శాతానికి, డీజిల్ పైన 15.83 శాతం నుండి 19.98 శాతానికి పెంచింది. ప్రస్తుతం కరోనా నుండి కోలుకుంటుండటంతో పెంచిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించేందుకు కేంద్రం సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఇది తగ్గనుంది. కరోనా సమయంలో ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఆ ప్రభావం ఇక్కడ పడింది. దీనికి తోడు కొన్ని రాష్ట్రాలు కరోనా సెస్ విధించాయి. వీటిన్నింటిని త్వరలో తొలగించే అవకాశముంది. ముఖ్యంగా సామాన్యులపై భారం పడకుండా కేంద్రం సెస్ను తగ్గించనుంది. అప్పుడు కాస్త భారం తగ్గుతుంది.
కరోనాకు ముందు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు 100 దాటినా వంద మార్కు దాటలేదు. కరోనా సమయంలో ఎక్సైజ్ డ్యూటీ పెంచడం, రాష్ట్రాలు సెస్ విధించడంతో అప్పుడు తగ్గాల్సిన ధరలు తగ్గలేదు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ 60 డాలర్ల వద్ద ఉంది.