తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: 2 నెలల్లో రూ.6 తగ్గుదల, కానీ
పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం (మార్చి 15) స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్,
చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు తదితర మెట్రో నగరాల్లో ధరలు 0.13 పైసల నుండి 0.27 పైసల వరకు తగ్గింది. కరోనా ప్రభావం కారణంగా గత కొంతకాలంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నాయి. శివారం పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని పెంచింది.

తగ్గిన ధరలు
మార్చి 15న హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధరలు 74.27, చెన్నైలో 14 పైసలు తగ్గి రూ.72.57, ఢిల్లీలో 0.27 పైసలు తగ్గి రూ.69.87, కోల్కతా, ముంబైలలో 0.13 పైసలు తగ్గి రూ.72.57గా ఉంది. బెంగళూరులో రూ.72.14గా ఉంది. డీజిల్ ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.

ప్రభుత్వానికి రూ.39వేల కోట్ల ఆదాయం
పెట్రోల్, డీజిల్లపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ శనివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిపై రూ.3 చొప్పున పెంచింది. దీంతో ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రూ.39వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ పెంపు అనంతరం పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ మొత్తం రూ.22.98, డీజిల్పై రూ.18.83కు చేరుకుంది.

రూ.3 ఎలా పెరిగిందంటే..
కేంద్ర పరోక్ష పన్నులు, ఎక్సయిజ్ బోర్డు నోటిఫికేషన్ ప్రకారం ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.2 పెరిగి రూ.8కి చేరుకుంది. డీజిల్పై ప్రత్యేక ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ.2 పెరిగి రూ.4కు పెరిగింది. అలాగే, పెట్రోల్, డీజిల్పై ఉన్న సెస్ రూ.1 పెరిగింది. ఇది రూ.10కి చేరుకుంది.

రూ.6 వరకు తగ్గిన ధర
అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు మారుతుంటాయి. జనవరి నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్యారెల్ ముడి చమురు 32 నుండి 35 డాలర్లకు చేరుకుంది. భారత్లోను ఈ కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.6 వరకు తగ్గాయి.

రెండు నెలల్లో తగ్గుదల
ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.76.01గా ఉంది. ఆదివారం (మార్చి 15) నాటికి 69.87గా ఉంది. అంటే రూ.6కు పైగా తగ్గింది. డీజిల్ రూ.69.17 నుండి రూ.62.58కి తగ్గింది. ఇది కూడా రూ.6కు పైగా తగ్గింది.


Click it and Unblock the Notifications