గుడ్న్యూస్: ఆదాయపు పన్ను రేట్లు మరోసారి తగ్గుతాయి! కారణమిదే
న్యూఢిల్లీ: ఆదాయపు పన్నుపై నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి సామాన్యులకు మరోసారి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సంకేతాలు ఇచ్చారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ఆమె పాల్గొని, ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఆయా రంగాలకు ఉద్దీపనలు ప్రకటించింది. అలాగే, వినిమయ శక్తిని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్నుపై మరోసారి గుడ్ న్యూస్ వినిపించవచ్చు.
ఆదాయపు పన్ను రేటు హేతుబద్దీకరణ
వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను హేతుబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి అనేక చర్యలను చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఐటీ (ఆదాయపు పన్ను) కోతలను కూడా పరిశీలిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జీడీపీ పురోగతికి కావాల్సిన అన్నిరకాల చర్యల్ని తీసుకుంటున్నామని చెప్పారు. వినియోగ సామర్థ్యం పెంచేందుకు, మార్కెట్లో రుణ లభ్యత పెరిగేందుకు తగిన నిర్ణయాలను అమలు పరుస్తున్నామన్నారు.
వ్యక్తిగత ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుందా.. అంటే
వ్యక్తిగత ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుందా అని నిర్మలా సీతారామన్ను ప్రశ్నించగా, బడ్జెట్ వరకు నిరీక్షించండి అన్నారు. మందగమన చర్యల్లో భాగంగా దీనిని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
ఆదాయపు పన్ను తగ్గిస్తే....
చెల్లించే ఆదాయపు పన్ను తగ్గడం వల్ల ప్రజల వినియోగశక్తిని మరింత పెరిగి, ప్రయివేటు పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఏర్పడుతాయని నిర్మలా సీతారామన్ అన్నారు. తద్వారా ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు ఇది కూడా కారణం అవుతుందని అభిప్రాయపడ్డారు.
గ్రామాల్లో వినియోగం పెంచేందుకు రూ.5 లక్షల కోట్లు పంపిణీ
ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు తోడ్పడే చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గత రెండు నెలల్లో రూ.5 లక్షల కోట్లను పంపిణీ చేశాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్రామాల్లో వినియోగాన్ని పెంచేందుకు ఈ కాలంలో ఈ మొత్తాన్ని పంపిణీ చేశాయన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేందుకు ఈ సొమ్ము తోడ్పడుతుందన్నారు. డిమాండ్ పుంజుకునేలా చేయడం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్యలు చేపడుతున్నామన్నారు.