బాయ్కాట్ టైంలో చైనా ప్లాన్! నిన్న HDFC, నేడు ICICలో పెట్టుబడులు, ఎలా సాధ్యమైంది?
కరోనా మహమ్మారి, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. గత మూడు నాలుగు నెలలుగా చైనా మొబైల్ ఫోన్స్ సహా ఇతర ఉత్పత్తుల సేల్స్ క్షీణించాయి. ఓ వైపు దేశంలో బాయ్కాట్ ఉద్యమం కనిపిస్తుంటే, మరోవైపు చైనాకు చెందిన కంపెనీలు, ఆర్థిక సంస్థలు మన దేశంలో దిగ్గజ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. చైనా లేదా ఆ దేశ కంపెనీల నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది.
వరల్డ్ ఫ్యాక్టరీ.. చైనా శకం ముగిసినట్లేనా? భారత్కు సూపర్ ఛాన్స్!
నిన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పెట్టుబడి
భారత ఆర్థిక సంస్థలపై చైనా దృష్టి పడినట్లుగా ఉంది. కొద్ది నెలల క్రితం ప్రయివేటురంగ దిగ్గజం HDFC బ్యాంకులో చైనా సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తన వాటాను పెంచుకుంది. జనవరి-మార్చి క్వార్టర్లో ఈ బ్యాంకులో తన వాటాను 1 శాతానికి పైగా పెంచుకుంది. దీంతో భారత ప్రభుత్వం క్లిష్టమైన ఫారెన్ పోర్ట్పోలియో పెట్టుబడుల నిబంధనలను తీసుకు వచ్చింది. ప్రధానంగా చుట్టుపక్కల దేశాల నుండి వచ్చే పెట్టుబడులు, అందులోను చైనా లక్ష్యంగా ఈ కొత్త పాలసీ వచ్చింది. అవకాశవాద టేకోవర్ను నిరోధించేందుకు భారత ప్రభుత్వం నాడు ఈ పాలసీని తెచ్చింది.
నేడు ICICI బ్యాంకులో వాటా
పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తాజాగా ICICI బ్యాంకులో కూడా షేర్లను దక్కించుకుంది. ఇటీవల రూ.15 వేలకోట్ల వాటాల విక్రయానికి(QIP) ఐసీఐసీఐ బ్యాంకు మొగ్గు చూపింది. ఇందులో 357 సంస్థాగత ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఇందులో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా ఉంది. రూ.15 కోట్ల విలువైన షేర్లను దక్కించుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూలో ఇది 0.0065 శాతంగా ఉంది. భారత్ బ్లూచిప్ కంపెనీలపై చైనా ఆసక్తి కనబరుస్తోంది. చైనాపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఐసీఐసీఐ చైనా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు షేర్లు కేటాయించడంపై విమర్శలు వస్తున్నాయి. అఖిల భారత ట్రేడర్స్ సమాఖ్య.. బ్యాంకు తీరును తప్పుబట్టింది. ఆర్బీఐ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ సంస్థలు కూడా
ఈ ఇన్వెస్టర్లలో గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, మోర్గాన్ ఇన్వెస్ట్మెంట్, సొసీట్ జెనెరల్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ 4.6 శాతం షేర్లు, మోర్గాన్ స్టాన్లీ 7.31 శాతం వాటను, సోసీట్ జెనెరల్ 5.55 శాతం షేర్లు కొనుగోలు చేసింది.
చైనా బ్యాంకు ఎలా ఇన్వెస్ట్ చేయగలిగింది?
చైనా పెట్టుబడులను కట్టడి చేసేందుకు కేంద్రం ఇటీవల అనేక ఆంక్షలు విధించింది. మనదేశంతో సరిహద్దు ఉన్న ఇతర దేశాల నుండి వచ్చే FDIలపై ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతులు తప్పనిసరి. దీంతో చైనా FPI మార్గాన్ని ఎంచుకున్నట్లుగా భావిస్తున్నారు. సెబి దగ్గర నమోదైన ఏ దేశ FPI అయినా మన స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ FPIలతో సహా ఎవరైనా కంపెనీ ఈక్విటీలో ఒక శాతానికి మించి షేర్లు కొంటే సెబికి తెలపాలి. చైనా కేంద్ర బ్యాంకు FPI రూపంలో HDFC, ICICI బ్యాంకులు సహా వివిధ ఆర్థిక సంస్థలు, బ్లూచిప్ కంపెనీల్లో షేర్లు కొంటోందని అంటున్నారు.