రూ.10 కోట్లు.. ఫీజులేదు: గూగుల్తో వివాదం.. పేటీఎం విజయశేఖరశర్మ కీలక ప్రకటన
గూగుల్తో వివాదం నేపథ్యంలో పేటీఎం కీలక ప్రకటన చేసింది. పేటీఎం మినీ యాప్ స్టోర్ డెవలపర్ల కోసం రూ.10 కోట్లను వెచ్చించనున్నట్లు పేటీఎం సీఈవో, ఫౌండర్ విజయ శేఖరశర్మ ప్రకటించారు. గురువారం యాప్ డెవలపర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలను ప్రకటించింది. ఈ సందర్భంగా మాట్లాడారు. గూగుల్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 30 శాతం ఫీజును వసూలు చేస్తో టోల్ కలెక్టర్గా వ్యవహరిస్తోందన్నారు. అందుకే యాప్ డెవలపర్ల కోసం మినీ యాప్ స్టోర్ తీసుకు వచ్చినట్లు వెల్లడించారు. ఇందులో 10 లక్షల యాప్స్ అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమన్నారు.
గూగుల్కు షాక్, పేటీఎం సరికొత్త యాప్ స్టోర్: ప్లేస్టోర్ పేమెంట్ రూల్ గడువు పెంపు
లిస్టింగ్ ఫీజు లేదు.. కానీ
'ఈ దేశంలోని మినీ యాప్ డెవలపర్ల కోసం రూ.10కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాం. అంటే మా ప్లాట్ఫాంలో మినీ యాప్స్ డెవలప్ చేసేవారు ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడిని కలిగి ఉంటారు.' అని డిజిటల్ కాన్ఫరెన్స్లో విజయ్ శేఖర్ శర్మ అన్నారు. ఈ ప్లాట్ఫాంలో మినీ యాప్ డెవలపర్లకు ఎలాంటి లిస్టింగ్ ఫీజును వసూలుచేయడం లేదన్నారు. అంతేకాకుండా పేటీఎం వాలెట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంకు, యూపీఐ వంటి ఉచిత చెల్లింపు మార్గాలను అందిస్తోందని, అయితే క్రెడిట్ కార్డులపై మాత్రం 2 శాతం ఛార్జీ ఉంటుందని తెలిపారు. దేశీయ టెక్నాలజీ ఎకో సిస్టం ఏర్పాటుకు తమ కంపెనీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇప్పటికే తమ మినీ యాప్ స్టోర్లో 300కు పైగా యాప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. డెకథ్లాన్, డోమినోస్ పిజ్జా, ఫ్రెష్ మెనూ, నెట్మేడ్స్, నో బ్రోకర్, లా వంటి యాప్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు.
అందుకే ఫీజు లేదు..
పేటీఎం మినీ యాప్ ప్రోగ్రాంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే 5,000 డెవలపర్లు చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు పేటీఎం తెలిపింది. తాము బ్యాకెండ్ డెవలర్లం మాత్రమే కాదని, భారత డెవలపర్లు ప్రపంచ అత్యుత్తమ యాప్స్ రూపొందించగలరని విజయ్ శేఖర్ శర్మ అన్నారు. డెవలరప్లు ఎంతో ఖర్చు చేసి, వనరులు ఖర్చు చేసి యాప్స్ డెవలప్ చేస్తారని, మార్కెటింగ్ కోసం ఖర్చులు చేస్తారని, కాబట్టి మినీ యాప్ స్టోర్ లిస్టింగ్ కోసం ఎలాంటి ఛార్జీ వసూలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. వారిపై 30 శాతం ఫీజు వసూలు చేస్తే ఖర్చు మరింతగా పెరుగుతుందన్నారు. అమ్మకపు ఆధాయంలో 30 శాతం డిస్ట్రిబ్యూటర్ నుండి అడిగినట్లుగా గూగుల్ తీరు ఉందని, ప్రస్తుతం గూగుల్ దయపై ఆధారపడి ఉన్నామని, వారి నిబంధనల ఆధారంగా ఎప్పుడు యాప్ను తొలగిస్తారో తెలియని పరిస్థితి అని మాట్రిమోనీ డాట్ కామ్ సీఈవో అన్నారు.
ఇక్కడ వివాదం
కాగా, సెప్టెంబర్ 18వ తేదీన తమ నిబంధనలు ఉల్లంఘించారంటూ పేటీఎంతో పాటు 18 యాప్స్ను గూగుల్ తొలగించింది. ఆ తర్వాత పేటీఎంను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఐతే ఈ వివాదంతో భారతీయ ప్లేస్టోర్ ఉండాలనే నినాదం యాప్ డెవలపర్ల నుండి వచ్చింది. ఇందులో భాగంగా పేటీఎం ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్ను ప్రారంభించింది. దీనిని వినియోగించుకునేందుకు డెవలపర్లు ఎలాంటి ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు. యాప్లను ఫోన్లో ఇన్స్టాల్ చేసే అవసరం లేకుండా మినీ యాప్ స్టోర్ నుండి మొబైల్ వెబ్ సైట్గా మార్చుకోవచ్చు.