2.6 లక్షల మంది కస్టమర్లకు పేటీఎం రీఫండ్, ఎందుకంటే
2020 ఏడాదిలో హైవేలలో టోల్ ప్లాజాల ద్వారా 2.6 లక్షల మంది FASTag కస్టమర్ల నుండి తప్పుగా వసూలు చేసిన టోల్ చార్జీ రుసుమును రీఫండ్ చేయడానికి పేటీఎం తన వినియోగదారులకు సహాయపడినట్లు పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్(PPBL) బుధవారం తెలిపింది. వాహనాన్ని తప్పుగా గుర్తించడం లేదా టోల్ ప్లాజాల ద్వారా పొరపాటుగా రెండుసార్లు చార్జీ తీసుకోవడం వంటి తప్పుడు వసూళ్లను తిరిగి వాహన యజమానులకు అందించేందుకు జరిపే చెల్లింపుల్ని సులభతరం చేసినట్లు వెల్లడించింది.
ఇందుకు పేటీఎం చెల్లింపుల సంస్థ వేగవంతమైన పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇది టోల్ ప్లాజా వద్ద జరిగే తప్పుడు చెల్లింపుల్ని గుర్తించి పరిష్కారం చూపుతుంది. FASTag ద్వారా టోల్ ఛార్జీల ఆటోమేటిక్ చెల్లింపును నిర్దారించేటప్పుడు కొన్నిసార్లు టోల్ ప్లాజాల వద్ద ఉన్న సిస్టమ్స్, ప్రాసెస్లలో సమస్యలు కారణంగా అసలు ఛార్జీ కంటే ఎక్కువ వసూలుకు కారణమవుతున్నాయి.
ఇలాంటి కస్టమర్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ తన కస్టమర్ల ఫిర్యాదులు, అనుబంధ టోల్ ట్రాన్సాక్షన్స్, టోల్ ప్లాజాలలో జరిగే సమస్యలను పూర్తిగా ఆడిట్ చేసే ఒక ఖచ్చితమైన వివాదాల్ని నివారించే నిర్వహణ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.