గూగుల్పై పేటీఎం, ఇతర స్టార్టప్స్ అసంతృప్తి, కారణమిదే
గూగుల్ వ్యవహారశైలితో భారత్ టెక్ కంపెనీలు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. గూగుల్తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఇటీవల గూగుల్ ప్లేస్టోర్ నుండి పేటీఎం యాప్ని తొలగించడంతో ఈ వివాదానికి బీజం పడినట్లుగా తెలుస్తోంది. యాప్స్ అందరికీ అందుబాటులో ఉండాలంటే గూగుల్ ప్లేస్టోర్ ఎంతో కీలకం. ఎక్కువ స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా నడుస్తుండటమే ఇందుకు కారణం.
గూగుల్ ఆధిపత్యంపై భారత్ టెక్ కంపెనీలు ముఖ్యంగా స్టార్టప్ కంపెనీలు గుర్రుగా ఉన్నాయట. ఈ సంస్థలు గూగుల్ తీరుకు వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయట. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. యాప్స్కు సంబంధించి గూగుల్ అనుసరిస్తున్న విధానాలు అన్యాయమని ఈ సంస్థలు భావిస్తున్నాయి. త్వరలో యుద్ధం జరుగుతోందని, గూగుల్ ఓడిపోతుందని ఇండియా మార్ట్ సీఈవో దినేష్ అగర్వాల్ అన్నారు.
హైదరాబాద్లో గోల్డ్మన్ శాక్స్ రెండో కార్యాలయం, 500 ఉద్యోగ అవకాశాలు
గత నెలలో గూగుల్ హఠాత్తుగా ప్లేస్టోర్ నుండి పేటీఎం యాప్ తొలగించడంతో వివాదం రాజుకుంది. ప్లేస్టోర్ నిబంధనలను పేటీఎం అతిక్రమించేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని గూగుల్ అప్పడు పేర్కొంది. ఈ అంశంపై పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ మంగళవారం సీరియస్గానే స్పందించారు. ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ గూగుల్ ఓ బిగ్ డాడీలా వ్యవహరిస్తోందని, యాప్స్కు ఆక్సిజన్ వంటి పంపిణీ వ్యవస్థను నియంత్రిస్తోందని, ఈ సునామీని అడ్డుకునేందుకు మనమంతా చేతులు కలపాలన్నారు. భవిష్యత్తు మన నియంత్రణలో ఉండాలన్నారు.