మేమున్నాం.. మీరు వ్యాపారం చేసుకోండి: 10,000 చిన్న షాప్స్కు పేటీఎం మాల్ ఆఫర్
కరోనా మహమ్మారి నేపథ్యంలో 10,000 స్థానిక కిరణా స్టోర్స్, చిన్న దుకాణాలతో జత కడతామని పేటీఎం మాల్ ఆదివారం తెలిపింది. వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు ఈ-కామర్స్ సంస్థలో పెరుగుతున్న రేసులో చేరాలని భావిస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కూడా ఇప్పటికే స్థానిక వ్యాపారులతో జత కట్టేందుకు సిద్ధపడ్డాయి. స్థానిక కిరాణా వ్యాపారులకు అండగా ఉండేందుకు రిలయన్స్ జియో మార్ట్ వచ్చింది. ఇటీవల మరింత సులభతరం చేసేందుకు పేస్బుక్తో జత కట్టింది. జియోమార్ట్ - వాట్సాప్ కలిసి వ్యాపారులకు, కస్టమర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఇతర సంస్థలు అదే దారిలో నడుస్తున్నాయి.
జియో మార్ట్ వాట్సాప్ సేవలు ప్రారంభం: ఎక్కడ, ఎలా ఆర్డర్ చేయాలి?
మరిన్ని నగరాలకు విస్తరించే ప్లాన్
జియో మార్ట్ దారిలో ఫ్లిప్కార్ట్, అమెజాన్ నడిచాయి. ఇప్పుడు పేటీఎం మాల్ కూడా 10,000 స్థానిక దుకాణదారులతో కలుస్తామని తెలిపింది. హైపర్ లోకల్ ఆపరేషన్స్ కోసం పేటీఎం మాల్ గత కొన్ని వారాలుగా పెట్టుబడులు పెట్టింది. దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాల్లో కిరణా, నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తోంది. రాబోయే ఎక్కువ నగరాల్లో మరిన్ని నగరాలకు విస్తరించాలని భావిస్తోంది.
చిన్న వ్యాపారులకు మద్దతు
ఈ-కామర్స్ ద్వారా స్థానికంగా ఉన్న కిరాణ్ స్టోర్స్ను అక్కడి కస్టమర్లకు అనుసంధానించడమే తమ లక్ష్యమని, చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలుస్తున్నామని, వస్తువుల పంపిణీలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నామని, పేటీఎం మాల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మోథే అన్నారు.
ఆర్డర్లు భారీగా పెరిగాయి
ప్రస్తుతం పేటీఎం మాల్ GATI, Ecom Express, Delhivery, Bluedart, FedEx వంటి ప్రముఖ లాజిస్టిక్ ప్లేయర్స్తో కలిసి పని చేస్తోంది. పేటీఎం మాల్ ప్రకారం టైర్ 2, టైర్ 3 పట్టణాలలో కిరణా ఐటమ్స్ సేల్స్లో భారీ పెరుగుదల నమోదయింది. 200కు పైగా నగరాల్లో పేటీఎం మాల్ ద్వారా ఆర్డర్లు వస్తున్నాయి. ఇండోర్, అహ్మదాబాద్, ఎన్సీఆర్, బెంగళూరు, లక్నో, పుణే, చెన్నై, లుధియానా, బతీంద్రా సహా వివిధ నగరాల్లో ఆర్డర్లు పెరిగాయి.
మేమున్నాం.. మీ వ్యాపారం నడుపుకోండి
ప్రస్తుతం చాలా కిరాణా దుకాణాలలో లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫోర్స్ తగ్గిపోయిందని చెబుతున్నారు. వర్క్ ఫోర్స్లో ఎక్కువ శాతం ఇళ్లకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో పేటీఎం మాల్ వారిని లాజిస్టిక్ పార్ట్నర్స్తో కనెక్ట్ చేస్తుందని తెలిపింది. కాబట్టి వ్యాపారులు తమ లాజిస్టిక్ పార్ట్నర్స్ ద్వారా డెలివరీ చేసుకోవడం ద్వారా వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చునని తెలిపింది. పేటీఎం మాల్ ద్వారా గ్రాసరీ స్టోర్స్ యజమానులు రోజుకు 50 శాతం అదనపు ఆర్డర్స్ చూస్తున్నారని తెలిపారు.