పేటీఎం లోకి భారీగా పెట్టుబడులు... ఎంతో తెలుసా?
ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ... పేటీఎం రికార్డు సృష్టించింది. దేశంలో ఇప్పటివరకు కనీ వినీ ఎరుగనంత భారీ పెట్టుబడిని సమీకరించింది. ఇండియన్ స్టార్టుప్ కంపెనీలు ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడిని ఆకర్షించటం ఇదే తొలిసారి అని సమాచారం. ఆ పెట్టుబడి ఎంతో తెలిస్తే నిజంగా ఔరా అని ఆశ్చర్య పోవాల్సిందే. తాజాగా పేటీఎం ఏకంగా 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ 7,000 కోట్లు) నిధులను సమీకరించింది. అమెరికా కు చెందిన ప్రముఖ అసెట్ మానేజ్మెంట్ సంస్థ టి రావె ప్రైస్ దీనికి నేతృత్వం వహించింది. ఈ నిధుల రౌండ్లో ఇప్పటికే పేటీఎంలో పెట్టుబడి పెట్టిన ఆంట్ ఫైనాన్సియల్ తో పాటు సాఫ్ట్ బ్యాంకు విజన్ ఫండ్ కూడా పాల్గొన్నాయని సమాచారం. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. వీటితో పాటు డిస్కవరీ కాపిటల్ అనే సంస్థ కూడా కొంత మేరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది.
16 బిలియన్ డాలర్లు...
ఈ ఏడాది ఇప్పటివరకు భారత్ లో జరిగిన అతి పెద్ద స్టార్టుప్ డీల్ లో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పేటీఎం విలువ ఏకంగా 16 బిలియన్ డాలర్ల (రూ 1,12,000 కోట్లు) కు పెరిగిపోయింది. కాగా పేటీఎం లోకి ఇంత భారీ పెట్టుబడి లభించిన విషయాన్నీ ఆ కంపెనీ ఫౌండర్ అండ్ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ వెల్లడించినట్లు ఈటీ పేర్కొంది. సాఫ్ట్ బ్యాంకు 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ 1,400 కోట్లు), ఆంట్ ఫైనాన్సియల్ 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 2,800 కోట్లు) కంపెనీ పెట్టుబడి పెట్టిన విషయాన్నీ అయన వెల్లడించారు.
రూ 24,500 కోట్లు...
ప్రస్తుతం సమీకరించిన పెట్టుబడితో కలిపితే పేటీఎం దేశంలోనే అత్యంత ఎక్కువ ప్రైవేట్ ఈక్విటీ నిధుల్ని పొందిన కంపెనీల్లో ఒకటిగా ఆవిర్భవించినది. ఇప్పటికే కంపెనీ సుమారు 2.5 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులను సమీకరించిన పేటీఎం... ప్రస్తుతం మరో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించటంతో మొత్తగా ఈ కంపెనీ ఇప్పటివరకు 3.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ 24,500 కోట్లు) సేకరించినట్లైంది. అమెరికా కంపెనీ ట్ రావె ప్రైస్ దాదాపు లక్ష కోట్ల డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహిస్తుంది. ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టటానికి కంపెనీ లను చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తుంది. అందులో మన దేశానికి సంబంధించి ఫ్లిప్కార్ట్ తర్వాత కేవలం పేటీఎం పైనే దాని కన్ను పడింది.
రూ 10,000 కోట్లు ఖర్చు చేస్తాం...
తాజాగా సమీకరించిన నిధులతో పేటీఎం దేశంలో భారీగా విస్తరించనుంది. పెద్ద పట్టణాలు, నగరాల్లోనే కాకుండా... దేశంలోని చిన్న పట్టణాల కూడా భారీగా తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కొత్త కస్టమర్లు, మర్చంట్లు తమ ప్లాట్ఫారం వినియోగించేలా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందుకోసం రూ 10,000 కోట్లను వెచ్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. దీని అర్థం ఏమిటంటే... పేటీఎం నుంచి భారీ డిస్కౌంట్ లు, ఆఫర్లు ఉండబోతున్నాయని. తమ పేమెంట్ బిజినెస్ ప్రస్తుతం లాభదాయకతను సాధించే దిశగా పయనిస్తోందని, కామర్స్ వ్యాపారం కూడా కొంత పుంజుకొన్నట్లు ఆయన తెలిపారు.
పోటీ భయం లేదు...
డిజిటల్ పేమెంట్ రంగంలో ఇండియా లో అత్యంత ఎక్కువ పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ పేటీఎం సహా... ఫ్లిప్కార్ట్ నకు చెందిన ఫోన్ పే, అమెజాన్ కు చెందిన అమెజాన్ పే, గూగుల్ సొంత సంస్థ గూగుల్ పే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ విభాగంలో పేటీఎం సహా ఏ కంపెనీ కూడా లాభాలు గడించిన దాఖలా లేదు. పేటీఎం అయితే ఏకంగా రూ వేళా కోట్లలో నష్టాలను చవిచూస్తోంది. అయినప్పటికీ... ఈ రంగంలో నెలకొన్న పోటీ తో తమకు ఎటువంటి ఆందోళన లేదని పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు. తాము ఇప్పటికే దేశంలో డిజిటల్ పేమెంట్ రంగంలో మార్కెట్ లీడర్ గా కొనసాగుతున్నామని తెలిపారు. అటు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ తమ కార్యకలాపాలు ఉన్నాయని, బిలియన్ డాలర్లు కుమ్మరించిన వారు కూడా ఇప్పటివరకు తమకు తగిన పోటీ ఇవ్వలేకపోయారని ఆయన ధీమా వ్యక్తం చేసారు.