ఆనంద్ మహీంద్రా, శ్రీనివాసన్లకు పద్మభూషణ్: హైదరాబాదీలో పుట్టిన వత్సకు పద్మశ్రీ
ఈ ఏడాదికి సంబంధించి కేంద్రం పద్మ పురస్కారాలను శనివారం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రులు జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లకు దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించింది. పలువురు పారిశ్రామికవేత్తలకు పద్మభూషణ్ ప్రకటించింది. ఆనంద్ మహీంద్రా, వేణు శ్రీనివాసన్లను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మవిభూషణ్, పదహారు మందిని పద్మభూషణ్, 118 మందిని పద్మశ్రీ వరించింది.
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా
ట్రాక్టర్ కంపెనీగా పేరున్న మహీంద్రా గ్రూపును వివిధ వ్యాపారాల్లోకి అడుగు పెట్టించారు ఆనంద్ మహీంద్రా. 1981లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంటుగా మహీంద్రా యూజిన్ స్టీల్లో ఆయన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభమైంది. 1989లో ప్రెసిడెంట్, ఎండీగా నియమితులయ్యారు. 1991లో మహీంద్రా అండ్ మహీంద్రా డిప్యూటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు.
విభిన్న వ్యాపారాల్లోకి మహీంద్రా..
1997లో ఎండీగా, 2001లో వైస్ చైర్మన్గా పదోన్నతి పొందారు. 2012 ఆగస్ట్ నెలలో తన మామ కేశుబ్ మహీంద్రా నుంచి మహీంద్రా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి కొత్త వ్యాపారాల దిశగా గ్రూప్ను తీసుకు వెళ్లారు. వివిధ కంపెనీల కొనుగోళ్లలో కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది ఏప్రిల్లో చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదాలో కొనసాగుతారు. ఈయన సామాజిక, రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తారు.
వేణు శ్రీనివాస్
కార్పొరేట్ ప్రముఖుల్లో వేణు శ్రీనివాసన్ ఒకరు. TVS గ్రూప్ చైర్మన్. ఈ గ్రూప్ వ్యవస్థాపకులు టీవీ సుందరం అయ్యంగార్కు మనవడు. గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ టీవీఎస్ మోటార్ దేశంలోనే మూడో అతిపెద్ద బైక్ తయారీ సంస్థ. వేణు శ్రీనివాసన్ తమ గ్రూప్ను పలు విభాగాల్లోకి విస్తరించారు. ప్రస్తుతం ఈయన టాటా గ్రూప్ వ్యాపారాల హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ బోర్డులో కూడా సభ్యులు. టాటా ట్రస్ట్ వైస్ చైర్మన్గానూ వ్యవహరిస్తున్నారు.
పద్మశ్రీ వీరికి...
ప్రేమ్ వత్స (ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ చైర్మన్), జై ప్రకాశ్ అగర్వాల్ (సూర్య రోషిణీ లిమిటెడ్ చైర్మన్), సంజీవ్ బిక్ చందానీ (నౌకరీ డాట్ కామ్ వ్యవస్థాపకులు), భరత్ గోయెంకా (టాలీ సొల్యూషన్స్ వైస్ చైర్మన్), డాక్టర్ నేమ్నాథ్ జైన్ (ప్రెస్టీజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్), విజయ్ శంకేశ్వర్ (వీఆర్ఎల్ గ్రూప్ చైర్మన్, ఎండీ), రోమేష్ వాద్వానీ (సింఫనీ టెక్నాలజీ గ్రూప్ వ్యవస్థాపకులు), గఫూర్ భాయ్ బిలాఖియా, చెవాంగ్ మోటుప్ గోబాలకు పద్మశ్రీ వచ్చింది.
ప్రేమ్ వత్స.. హైదరాబాదీ
ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రంగంలో ప్రేమ్ వత్సను పద్మశ్రీ వరించింది. కెనడియన్ వారెన్ బఫెట్గా పిలిచే ప్రేమ్ వత్స హైదరాబాదులో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఐఐటీ మద్రాస్ నుంచి కెమికల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ ఒంటారియో నుంచి ఎంబీయే పూర్తి చేసి, ఓ బీమా కంపెనీలో పని చేశారు. 1984లో హాంబ్లిన్ వత్స ఇన్వెస్ట్మెంట్ కౌన్సెల్ పేరుతో పెట్టుబడి కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత ఇది ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్గా మారింది. థామస్ కుక్, క్వెస్ కార్ప్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సహా వివిధ వాటిల్లో పెట్టుబడులు పెట్టింది.