కరోనా ఎఫెక్ట్: ఉద్యోగులకు ఓయో షాక్, 4 నెలల పాటు 25% శాలరీ కట్
కరోనా మహమ్మారి కారణంగా విమాయానం, పర్యాటక, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే విమాన రంగాల్లో పెద్ద ఎత్తున వేతనం లేని సెలవులు, శాలరీ కోత విధిస్తోన్న విషయం తెలిసిందే. హోటల్ రంగంలోను అదే పరిస్థితి ఉంది. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ తాజాగా తమ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల వేతనంలో 25% తగ్గిస్తున్నట్లు తెలిపింది.
మైక్రోసాఫ్ట్, గూగుల్ పైనా కరోనా దెబ్బ: పిచాయ్ ఏం చెప్పారంటే?
4 నెలల పాటు 25 శాతం వేతనం కట్
వరుసగా నాలుగు నెలల పాటు అంటే ఏప్రిల్ నుండి జూలై నెలలు 25 శాతం వేతనం తగ్గించుకొని తీసుకోవాలని కోరింది. అంతేకాదు, కొంతమంది ఉద్యోగులను ఏకంగా నాలుగు నెలలు (మే 4వ తేదీ నుండి ఆగస్ట్ 30 వరకు) సెలవులపై పంపించింది. వారికి అతి స్వల్ప ప్రయోజనాలు మాత్రమే కల్పించింది. కరోనా కారణంగా ప్రస్తుతం చాలా కంపెనీలు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రోహిత్ కపూర్ ఈ మెయిల్ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు.
అదనపు ప్రయోజనాల్లో మార్పు లేదు
ప్రస్తుతం మన కంపెనీ కఠినమైన, తప్పనిసరి నిర్ణయాన్ని తీసుకుంటోందని, ఓయూ ఉద్యోగులు అందరు కూడా 25 శాతం వేతనం కట్కు అంగీకరించాలని కోరుతున్నానని ఆ మెయిల్లో పేర్కొన్నారు. ఇది ఏప్రిల్ - జూలై మధ్య నాలుగు నెలలు ఉంటుందని తెలిపారు. కేవలం వేతనంలో మాత్రమే తగ్గింపు ఉందని, మిగతా అదనపు ప్రయోజనాల్లో ఎలాంటి మార్పులు లేవని తెలిపారు.
అందుకే కఠిన నిర్ణయం
లాక్ డౌన్ కారణంగా హోటల్స్ మూతబడ్డాయి. దీంతో రూమ్స్ బుకింగ్కు అవకాశమే లేదు. దీంతో ఓయో నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హోటల్ బిజినెస్ కుంటుబడిందని రోహిత్ కపూర్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణలు ఆగిపోవడం, దేశఈయంగా వ్యాపారాలు స్తంభించడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో అదనపు సహకారం
ఓయో హోటల్స్లో ఇండియాలో 7వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో చాలామందికి వేతనం కట్ కానుంది. అదే సమయంలో లీవ్ విత్ లిమిటెడ్ బెనిఫిట్స్ (కనీస సౌకర్యాలతో కొంతమందికి 4 నెలలు సెలవులు) కల్పించిన వారికి వైద్య బీమా, స్కూల్ ఫీజు రీయింబర్సుమెటంట్స్, ఎక్స్గ్రేషియా మద్దతు ఉంటుందని తెలిపింది. వైద్య అత్యవసర పరిస్థితి అయితే బీమా మొత్తానికి మించి సహకారం ఉంటుందని తెలిపింది.