7,453 మంది ఎయిరిండియా ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు
ఎయిరిండియా లిమిటెడ్ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సురెన్స్ వంటి ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు వర్తించనున్నాయి. డిసెంబర్ నెలకు గాను 7,453 మంది ఉద్యోగుల తరఫున విమానయాన సంస్థ పీఎఫ్ చందా చెల్లించిందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. టాటా గ్రూప్కు ఎయిరిండియాను ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన అప్పగించింది. ఈపీఎఫ్ఓ వర్తింపు నిమిత్తం ఎయిరిండియా దరఖాస్తు చేసుకోగా, ఇందుకు అనుమతి లభించింది. ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా ఈపీఎఫ్ఓలో చేరింది ఎయిరిండియా.
ఈపీఎఫ్ అండ్ ఎంపీ చట్టం-1952 యూ/ఎస్ 1(4) కింద ఎయిరిండియా దరఖాస్తు చేసింది. ఈపీఎఫ్ఓ ప్రయోజనాలు 2021 డిసెంబర్ 1 నుండి వర్తించేలా అనుమతిస్తూ 2022, జనవరి 14న ఓ అధికారిక నోటిఫికేషన్ ద్వారా తెలియజేశామని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇంతకుముందు వీరు పీఎఫ్ చట్టం 1925 పరిధిలో ఉన్నారు. ఉద్యోగి వేతనంలో పది శాతాన్ని యాజమాన్యం తన వాటాగా, మరో పది శాతం ఉద్యోగి, పీఎఫ్ మొత్తంలో జమ చేసేవారు. ఇకపై ఇరువైపులా 12 శాతం జమ అవుతుంది. తాజా మార్పు వల్ల ఈపీఎఫ్ పథకం 1952, ఈపీఎస్ 1955, ఈడీఎల్ఐ 1976 వీరికి లభిస్తాయి.