Salary Hike: హమ్మయ్య! వచ్చే ఏడాది వేతనాలు భారీగా పెరుగుతున్నాయ్!
కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి. చాలామందికి వేతనాల్లో కోత విధించాయి కంపెనీలు. కొద్ది కంపెనీలు మినహా దాదాపు అన్ని కంపెనీల్లోను ఏడాదిన్నరగా వేతన పెంపు లేదని చెప్పవచ్చు. అయితే వచ్చే సంవత్సరం (2022 క్యాలెండర్ ఇయర్)లో భారత్లోని సంస్థలు సగటున 9.4 శాతం మేర వేతనాలు పెంచే అవకాశాలు ఉన్నాయని ఓ సర్వేలో వెల్లడైంది. అన్ని రంగాల్లోను సానుకూల ధోరణి కనిపిస్తోందని ఈ సర్వే వెల్లడించింది.
ఈ మేరకు అయాన్ కన్సల్టింగ్ సంస్థ సర్వేలో పలు అంశాలు వెల్లడయ్యాయి. కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న రంగాల్లో రియాల్టీ కూడా ముందు ఉంది. ఈ రంగంలోను వచ్చే ఏడాది సగటున 8.8 శాతం వేతనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే తెలిపింది.
నిపుణులకు యమ డిమాండ్
రియాల్టీ రంగంలో 2021లో 6.2 శాతం వేతన పెంపుతో పోలిస్తే 2022లో 8.8 శాతం వేతనాలు పెంచాలని భావిస్తోందని సర్వేలో వెల్లడైంది. 2018లో సగటు పెరుగుదల 9.5 శాతంగా ఉందని అంచనా వేసింది. గతంలో డబుల్ డిజిట్ స్థాయిలో వేతనాలు పెరిగినా 2017 ఆ తర్వాత దేశంలో సగటు ఇంక్రిమెంట్ గణాంకాలు 9.3 శాతం కంటే తక్కువకు చేరుకున్నాయి.
ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ డిజిటల్ సేవలు పెరిగాయి. ఈ రంగం నిపుణులకు డిమాండ్ భారీగా పెరిగింది. అందుకే వేతన బడ్జెట్ పెరుగుతోందని సర్వే తెలిపింది. 2022లో వేతన పెంపు ఆర్థిక రికవరీ, మెరుగైన కస్టమర్ సెంటిమెంట్, ప్రతిభావంతుల ఉద్యోగ నైపుణ్యాన్ని సూచిస్తోంది. 2021 కీలకమైన నిపుణుల డిమాండ్ను చూసిందని సర్వే పేర్కొంది. తమ సంస్థల్లో సగటు వేతన పెంపు కంటే మంచి నైపుణ్యం ప్రదర్శించే వారికి మరింత వేతన పెంపు ఉంటుందని పలు సంస్థలు వెల్లడించినట్లు ఈ సర్వే తెలిపింది.
ఏ రంగం ఎంతంటే?
2021లో 10.5 శాతంతో పోలిస్తే 2022లో సగటున 11.2 శాతం పెంపుతో టెక్నాలజీ రంగం ముందు ఉండనుందని ఈ సర్వేలో వెల్లడైంది. ఆ తర్వాత ప్రొఫెషనల్ సర్వీస్, ఈ-కామర్స్ కంపెనీలు 10.1 శాతం వేతన పెంపును, ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, కన్స్యూమర్ గూడ్స్ రంగాలు గతంలో వలె 9.2 శాతం నుండి 9.6 శాతం వేతన పెంపును అందించనున్నాయి.
2020లో వెనుకబడిన రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి 8.8 పెంపును అందించే అవకాశముంది. గత 18 నెలల్లో కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న హాస్పిటాలిటీ, రెస్టారెంట్ రంగం 7.9 శాతం వేతన పెంపును అందించనుంది. ఎనర్జీ, ఇంజనీరింగ్ డిజైన్ సేవలు వంటి కీలక రంగాలు 7.7 శాతం, ఇంధన రంగం 7.7 శాతం వేతన పెంపును అందించవచ్చు.
అన్ని రంగాల్లో పాజిటివ్
దాదాపు అన్ని రంగాల్లోను పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తోందని, ఇండియా ఇంక్ రికవరీ బాటలో ఉందని, దాదాపు అన్ని సంస్థలు కూడా 2019లో వలే 2022లో వేతన పెంపును అమలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఈ సర్వే తెలిపింది.
ఫైనాన్షియల్ హెల్త్, ఆర్థిక తేజస్సుకు ఇది నిదర్శనమని, 2020లో వేతన పెంపు 6.1 శాతం కాగా, 2021లో 8.8 శాతానికి పెరిగిందని, 2022లో 9.4 శాతానికి పెరుగుతోందని అయాన్స్ హ్యూమన్ క్యాపిటల్ బిజినెస్ పార్ట్నర్ రూపాంక్ చౌదరీ అన్నారు. కరోనా భారత్ను బలంగా తాకినప్పటికీ దేశీయ సంస్థలు క్లిష్ట సమయంలో దృఢత్వాన్ని ప్రదర్శించాయని ఈ సర్వే పేర్కొంది.