Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
Adani: అదానీ వ్యాపారాల్లో అవకతవకలు ఉన్నాయంటూ వచ్చిన నివేదికను అస్త్రంగా మలుకునే పనిలో విపక్షాలు ఉన్నాయి. దీనిపై ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చ జరపాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అసలు వ్యవహారం ఇంత హాట్ గా మారినప్పటికీ కేంద్రం నిమ్మకు నీరు పెట్టినట్లు ఉండటం వివాదానికి కారణంగా మారుతోంది.
ప్రధాన ప్రతిపక్షాలు..
అదానీ విషయంలో విపక్షాలు స్పీడు పెంచాయి. హిండెన్ బెర్గ్ నివేదిక వ్యవహారంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, శివసేన, జేడీయూ, ఎన్సీపీ, వామపక్షాలు సహా 13 పార్టీలు గురువారం సమావేశమయ్యాయి. పార్లమెంటులో ఈ వ్యవహారంపై ఎట్టిపరిస్థితుల్లో చర్చకు పట్టుపట్టాల్సిందేనని వారు నిర్ణయించారు. దేశంలోని చాలా మంది ఇన్వెస్టర్ల డబ్బు అదానీ గ్రూప్ కంపెనీల పతనం వల్ల నష్టపోతున్నట్లు వారు భావిస్తున్నారు.
సభ ప్రారంభంతో..
పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాగానే విపక్షాలన్నీ ఒకే గొంతుకతో అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేశాయి. దీంతో లోక్ సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేయటం జరిగింది. దీనికి ముందు కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు.
పోరాటం పెద్దదౌతోంది..
చర్చను అనుమతించకుండా.. సభను వాయిదా వేయటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఈ పోరాటాన్ని పార్లమెంట్ నుంచి వీధుల్లోకి తీసుకెళ్లాలని విపక్షాల కూటమి నిర్ణయించింది. ఈ క్రమంలో వారు విజయ్ చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. ఇది దేశంలో అతిపెద్ద ఆర్థిక కుంభకోణమని.. దీనిపై వివచారణం జరగాల్సిందేనని కాంగ్రెస్ నేత మల్లిఖార్చున ఖడ్గే అన్నారు.
|
ప్రజాధనం..
కష్టపడి సంపాదించిన ప్రజల డబ్బు మునిగిపోయే ప్రమాదం ఏర్పడిందని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన అంశమని, దీనిపై వెంటనే చర్చించాల్సిన అవసరం ఉందని వారు పట్టుబడుతున్నారు. అదానీ గ్రూప్ కంపెనీల పరిస్థితి వల్ల సామాన్యులు పెద్దఎత్తున మునిగిపోయే ప్రమాదముందని తెలిపారు. ముఖ్యంగా అదానీ కంపెనీల్లో ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ పెట్టుబడులు మునిగిపోయే ప్రమాదం ఉందని.. అదే జరిగితే చిన్న ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ తగులుతుందని వారు అంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో మోదీ ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనే విషయం వేచిచూడాల్సిందే. మోదీ మైత్రి అదానీని కాపాడుతుందో.. లేదో.. చూడాలి.