రూ.5 లక్షలకు డిమాండ్.. సమాచారం లేదు, డిపాజిట్లపై బీమా రూ.1 లక్షే
న్యూఢిల్లీ: బ్యాంకులు దివాలా తీసినప్పుడు డిపాజిటర్లకు లభించే రూ.1 లక్ష బీమా సదుపాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పోరేషన్ (DICGC) మంగళవారం వెల్లడించింది. ఏదైనా బ్యాంకు దివాలా తీసినప్పుడు ఆ బ్ాయంకులోని డిపాజిటర్లకు DICGC చట్టంలోని సెక్షన్ 16(1) ప్రకారం అసలు, వడ్డీ కలిపి రూ.1 లక్ష వరకు బీమా లభిస్తుంది.
PMC దెబ్బ: బ్యాంకులు హఠాత్తుగా చేతులెత్తేస్తే.. ముందుగా ఇవి తెలుసుకోండి!
బీమా పరిమితి పెంచడంపై సమాచారం లేదు
బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని పెంచడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని DICGC స్పష్టం చేసింది. ప్రస్తుతం డిపాజిట్లపై అందుబాటులో ఉన్న బీమా రూ.1 లక్ష వరకేనని పేర్కొంది. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా పీటీఐ పెట్టుకున్న దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుబంధ సంస్థ ఇది.
రూ.1 లక్ష బీమా
అన్ని వాణిజ్య, విదేశీ, స్థానిక, ప్రాంతీయ బ్యాంకు డిపాజిట్లకు DICGC బీమా సదుపాయాలు కల్పిస్తుంది. ఏదేని కారణంతో బ్యాంకులు డిపాజిటర్ల సొమ్ముని చెల్లించకుంటే వారికి బీమా అందిస్తుంది. ఈ బీమా కోసం ఖాతాదారులు ఎలాంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు. కానీ ఖాతాల్లో ఎంత మొత్తం ఉన్నప్పటికీ ప్రస్తుత నిబంధన ప్రకారం రూ.1 లక్షకు మించి బీమాను అందించడం లేదు.
రూ.5 లక్షలకు డిమాండ్
ఇటీవల పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (PMC) స్కాం నేపథ్యంలో ఈ బీమా పెంచాలన్న డిమాండ్లు వినిపించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది. గత నెలలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బ్యాంకు డిపాజిట్లపై బీమాను పెంచనున్నట్లు తెలిపారు. ఆరెస్సెస్ అనుబంధ సంఘాలు కూడా వ్యక్తిగత డిపాజిట్ ఇన్సురెన్స్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశాయి.
మాకు తెలిసింది ఇదే..
ఈ మేరకు బీమాను పెంచే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా అని ఆర్టీఐ ద్వారా వచ్చిన ప్రశ్నకు DICGC అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. కార్పోరేషన్కు ఈ విషయంలో ఎలాంటి కచ్చితమైన సమాధానం లేదని సమాధానం వచ్చింది. ఏదేనీ బ్యాంకు దివాలా తీసి లిక్విడేట్ కోసం వచ్చినప్పుడు ఆ బ్యాంకులో ఉన్న ఖాతాదారుకు చట్టం ప్రకారం రూ.1 లక్ష వరకే బీమా రక్షణ ఉంటుందని, అసలు, వడ్డీ కలిపి అందులోనే వస్తుందని, ఒకే బ్యాంకుకు చెందిన వివిధ శాఖల్లో ఒకే ఖాతాదారుడికి వివిధ డిపాజిట్లు ఉన్నప్పుడు గరిష్టంగా రూ.1,00,000 వరకే బీమా వస్తుందని తెలిపింది.