ఓలా, ఉబెర్ సహా క్యాబ్ అగ్రిగేటర్లకు ప్రభుత్వం హెచ్చరిక
క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలు ఓలా, ఉబెర్లకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించే అంశంలో మెరుగుపడకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. రైడ్ క్యాన్సిల్ విధానంతో పాటు పలు అంశాల్లో క్యాబ్ అగ్రిగేటర్లు అన్యాయమైన బిజినెస్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయా కంపెనీ ప్రతినిధులతో ప్రభుత్వం మంగళవారం భేటీ అయింది. భేటీలో ఓలా, ఉబెర్, మేరు, ర్యాపిడో, జుగ్ను ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ భేటీలో ప్రధానంగా క్యాబ్ సర్వీస్ సంస్థలకు సంబంధించి కార్యకలాపాల నిర్వాహణ, ఫేర్ ప్రైసింగ్ అల్గారిథమ్, డ్రైవర్స్, పేమెంట్స్ స్ట్రెక్చర్స్ వివరాలను వెంటనే అందించాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అత్యవసరంగా పని మీద బయటకు వెళ్లాలంటే మండే ఎండలకు భయపడి ఏసీ ఆన్ చేస్తే, ఛార్జీల మోత మోగిస్తున్నారని, అడిగేవారులేక, నియంత్రించే మార్గం లేకపోవడంతో సంస్థలు ప్రయాణీకుల నుండి ఎక్కువగా వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పీక్ అవర్స్ మాత్రమే కాదని, సాధారణ సమయాల్లో కూడా అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బుకింగ్స్ అంగీకరించిన అనంతరం, డ్రైవర్ల ఒత్తిడితో కస్టమర్లు రైడ్ను రద్దు చేసుకోవడంతో ఈ ఛార్జీని కస్టమర్లు భరించాల్సి వస్తోందని తమ దృష్టికి వచ్చిందని ఈ భేటీ సందర్భంగా చెప్పారు. కస్టమర్ల నుండి ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ఇందుకు సంబంధించిన గణాంకాలను కూడా ఇచ్చామని, ఆయా సంస్థలు తమ వ్యవస్థలను మెరుగుపరుచుకోవాలని కోరామని, అలా జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కస్టమర్ల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అన్నారు.