ఓలా ఉద్యోగులకు బంపర్ ఆఫర్... రూ 326 కోట్ల ఈసోప్స్!
ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఓలా ఉద్యోగులకు శుభవార్త. వాళ్లకు జాక్ పాట్ లభించనుంది. ఓలా ఉద్యోగులకు ఇచ్చే ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్స్ (ఈసోప్స్) పరిమాణాన్ని మరింత పెంచింది. తాజాగా సుమారు రూ 326 కోట్ల విలువైన షేర్లను అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు కేటాయించనుంది. ఇందుకోసం కొత్తగా 1,53,623 ఈక్విటీ షేర్ల ను జారీ చేయాలనీ నిర్ణయించింది. దీంతో చాలా మంది ఓలా ఉద్యోగులు కొత్తగా లక్షాధికారులు, కోటీశ్వరులు కానున్నారు.
ఎందుకంటే.. ఒక్కో ఓలా షేరు విలువ రూ 21,250 ఉండటం విశేషం. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఇంట్రాకర్ ఒక ప్రత్యేక కథనంలో వెల్లడించింది. దేశంలో ఓలా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంది. దేశీయంగా ఏర్పాటయిన ఈ సంస్థ... అమెరికా స్టార్టుప్ దిగ్గజం ఉబెర్ కు గట్టి పోటీ ఇస్తోంది. ఇటు ఇండియా లోనే కాకుండా లండన్ సహా ఆస్ట్రేలియా తదితర దేశాల్లోనూ ఓలా తన సేవలను ప్రారంభించి నువ్వా... నేనా అనేలా ఉబెర్ తో పోటీ పడుతోంది.
దిగ్గజాల సరసన ఓలా ...
ఇండియా లో ఏర్పాటై... విజవంతంగా నడుస్తున్న స్టార్టుప్ కంపెనీలు తమ ఉద్యోగులను కాపాడుకునేందుకు ఈసోప్స్ జారీ చేస్తుంటాయి. తద్వారా కంపెనీలో తాము కూడా భాగస్వాములమే నన్న అంకిత భావం ఉద్యోగుల్లో నెలకొంటుంది. దీంతో స్టార్టుప్ కంపెనీల్లో వచ్చే అనిశ్చిత పరిస్థితుల్లోనూ కట్టుబడి పనిచేస్తారని కంపెనీల ఆలోచన. అందుకే పెద్ద కంపెనీలు మాత్రమే చేయగలిగే ఈ షేర్ల కేటాయింపును స్టార్టుప్ కంపెనీలు కూడా ఫాలో అవుతున్నాయి. ఇప్పటికే బైజూస్, అన్-అకాడమీ, రివిగో, కార్ దేఖో, పేటీఎం, రాజోర్ పే, మీషో, జెరోధా, బౌన్స్ వంటి స్టార్టుప్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈసోప్స్ కేటాయించాయి. ఓలా కూడా ఇప్పటికే తన ఉద్యోగులకు ఈసోప్స్ కేటాయించి వాటిని 2018 లో విక్రయించుకునే అవకాశం కూడా కల్పించింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా మరో రూ 326 కోట్ల విలువైన ఈసోప్స్ జారీ చేయటం విశేషం.
ఐపీవో కోసమేనా...
ఓలా మరికొన్ని రోజుల్లో ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) కు వెళ్లాలని భావిస్తోంది. ఉద్యోగులకు అంత పెద్ద స్థాయిలో ఈసోప్స్ కేటాయించటం కూడా ఒక వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరో 18 నెలల్లోనే ఐపీవో కు రానుందని మార్కెట్ వర్గాల సమాచారం. అందులో భాగంగానే ఓలా ఖర్చులు తగ్గించుకునే పనిలో పడిందని చెబుతున్నారు. అందుకోసం ఇప్పటికే 1,000 మంది ఉద్యోగులకు స్వస్తి పలికింది. ఇందులో పై స్థాయి ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇన్వెస్టర్ల నుంచి కాష్ బర్న్ రేటు తగ్గించుకోవాలని ఎప్పటినుంచో ఓలా పై ఒత్తిడి వస్తోంది. అందుకు అనుగుణంగానే కంపెనీ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొత్త నిబంధనలు...
ఇటీవల 2020 బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.... ఈసోప్స్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన కొత్త నిర్ణయాలు ప్రకటించారు. అందులో ఉద్యోగులకు కేటాయించే సోప్స్ విక్రయంపై పన్ను వాయిదా వేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో ఉద్యోగులకు ఈసోప్స్ కేటాయించిన వెంటనే పన్ను చెల్లించే బదులు... వాటిని విక్రయించినప్పుడు మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకోసం గరిష్టంగా 5 సంవత్సరాల వరకు గడువు కూడా ఇచ్చింది. ఈ లోగా ఉద్యోగి వాటిని విక్రయించినా... లేదా కంపెనీ నుంచి వైదొలిగినా ... ఇందులో ఏది ముందు అయితే అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొత్త వారు స్టార్టప్ కంపెనీల్లో చేరి వారి సేవలను అందించేందుకు మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.