ఏడేళ్ల గరిష్టానికి పెట్రోలియం ధరలు, అమెరికా 'స్ట్రాటెజిక్' నిర్ణయం
చమురు ధరలు వరుసగా పెరుగుతున్నాయి. మంగళవారం (జనవరి 18) అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. యెమెన్ హుతి గ్రూప్ తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన బాంబు దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో సరఫరా ఆందోళనలతో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ అలైన్డ్ గ్రూప్-సౌదీ అరేబియన్ నేతృత్వంలోని సంకీర్ణాల మధ్య ఆగ్రహజ్వాలల ప్రభావం చమురు మార్కెట్ పైన ఉంటుంది. తాజా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ అంతటా కొనసాగుతున్న సంక్లిష్టతను పెంచిందని నిపుణుల మాట.
ఏడేళ్ల గరిష్టానికి...
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్కు నేటి ప్రారంభ సెషన్లో 44 సెంట్లు లేదా 0.5 శాతం లాభపడి 86.92 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 2014 అక్టోబర్ 30వ తేదీన బ్రెంట్ క్రూడ్ 87,000 డాలర్లను తాకింది. ఆ తర్వాత ఇదే గరిష్టం. అంటే బ్రెంట్ క్రూడ్ ఏడేళ్ల గరిష్టాన్ని తాకింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్(WTI) క్రూడ్ ఫ్యూచర్ బ్యారెల్కు గత శుక్రవారం 81 సెంట్లు లేదా 1 శాతం లాభపడి 84.62 డాలర్ల వద్ద ముగిసింది. ఇది రెండు నెలల క్రితం 84.78 డాలర్లను తాకింది. రెండు నెలల గరిష్టానికి సమీపంలో ఉంది.
ఉత్పత్తి సరఫరా
డ్రోన్, క్షిపణి దాడుల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. హుతి ఉద్యమం మరిన్నింటిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు హెచ్చరికలు పంపించింది. యూఏఈ కూడా ఈ ఉగ్రవాద దాడులకు గట్టిగా స్పందిస్తామని తెలిపింది. ఈ దాడి తర్వాత తమ వినియోగదారులకు ఉత్పత్తి సరఫరాను నిరంతరాయంగా అందించనున్నట్లు యూఏఈ ఆయిల్ కంపెనీ అడ్నాక్ తెలిపింది. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థలోని కొన్ని ఉత్పత్తి సంస్థలు తక్కువ పెట్టుబడి, ఇతర అంతరాయాల కారణంగా సరఫరా డిమాండ్ను చేరుకోలేకపోవచ్చునని అంటున్నారు.
అమెరికా నిర్ణయం
చమురు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ వైట్ హౌస్ అచేతనంగా ఉంది. సాంకేతిక అంశాల కారణంగా చాలా ఒపెక్ దేశాలు తమ అధిక ఉత్పత్తి కోటా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైట్ హౌస్, ఇతర సంబంధిత దేశాలు నిర్ణయాధికారాల కోసం వేచి చూస్తున్నారు.
స్ట్రాటెజిక్ పెట్రోలియమ్ రిజర్వ్స్ నుండి 50 మిలియన్ బ్యారెళ్ల పెట్రో ఉత్పత్తులను విడుదల చేస్తామని, తద్వారా ధరలను తగ్గించే ప్రయత్నాలు చేస్తామని అమెరికా అధ్యక్షులు జోబిడెన్ అన్నారు. అయితే ఇది స్వల్పకాలిక పరిష్కారమేనని నిపుణుల మాట. వాస్తవానికి ధరలు గత కొన్నాళ్లుగా తగ్గుతున్నాయి. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మూడంకెల ధరకు త్వరలో చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.