పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్, ఎందుకంటే?
అంతర్జాతీయంగా చమురు ధరలు మొన్నటి వరకు భారీగా పెరిగాయి. అయితే రెండు రోజులుగా కాస్త శాంతిస్తున్నాయి. అయినప్పటికీ బ్రెంట్ క్రూడ్, వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధరలు రికార్డ్ గరిష్టానికి చేరువలో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఏడేళ్ల గరిష్టాన్ని తాకింది. నేడు WTI క్రూడ్ ధర 84.28 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 87.19 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డబ్ల్యుటీఐ ఇటీవల 86 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 89 డాలర్లకు చేరువైంది. రెండు రోజులుగా కాస్త తగ్గుతున్నప్పటికీ, ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఉత్పత్తి తగ్గింపు, హుతి దాడి, ఒమిక్రాన్ ప్రభావం, డిమాండ్ పెరుగుదల వంటి అంశాలు చమురు మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు గత ఏడాది రికార్డ్ స్థాయికి పెరిగాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించడంతో వినియోగదారులపై కాస్త భారం తగ్గింది. అయితే అంతర్జాతీయంగా 2022 ప్రారంభం నుండి ధరలు పెరుగుతున్నాయి. 70 డాలర్ల నుండి 72 డాలర్ల మధ్య ఉన్న ముడి చమురు ధరలు 90 డాలర్ల సమీపానికి చేరుకొని, ప్రస్తుతం 85 డాలర్లకు పైన ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీన బ్రెంట్ క్రూడ్ ధర 69 డాలర్లు కాగా, బుధవారం 88 డాలరలు దాటింది. బ్రెంట్ త్వరలో 100 డాలర్లకు చేరుకోవచ్చునని అంతర్జాతీయ మార్కెట్ నిపుణుల అభిప్రాయం.
అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశంలో దాదాపు అన్నిచోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటాయి. లీటర్ డీజిల్ రూ.100కు పైకి చేరుకుంది. పెట్రోల్ కొన్ని చోట్ల రూ.120 దాటింది. అయితే కేంద్రం నవంబర్ నెలలో పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 చొప్పున వ్యాట్ను తగ్గించింది. దీంతో ధరలు కాస్త తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం తగ్గించినప్పటికీ, అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చమురు ధరలు పెరిగితే నిత్యావసరాలపై కూడా ప్రభావం పడుతుంది. అప్పుడు ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముంటుంది.