పెట్రో రేట్లు మోత మోగిపోవడానికి కారణాలేంటీ..కేంద్రం ఉద్దేశమేంటీ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి కొరడా ఝుళిపించాయి. తాజాగా వాటి రేట్లను పెంచేశాయి. ఈ నెలలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఇది 15వ సారి. అంటే నెలలో ఇప్పటికే సగం రోజులకు పైగా వాటి రేట్లను పెంచినట్టయింది. ధరలలను పెంచడంలో ఏ మాత్రం రాజీ ధోరణిని ప్రదర్శించట్లేదా ఆయిల్ కంపెనీలు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయలకు చేరువ అవుతోంది. పలు చోట్ల డీజిల్ కూడా 100 రూపాయల మార్క్ను దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపు కాదు.
పెట్రోల్, డీజిల్పై ఎంత పెరిగిందంటే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్పై లీటర్ ఒక్కింటికి 31 నుంచి 35 పైసలు, డీజిల్ 26 నుంచి 30 పైసల మేర పెరిగింది. కిందటి నెల 4వ తేదీన ఆరంభమైన పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల ఎక్కడే గానీ ఆగలేదు. మధ్యలో కొంత విరామాన్ని ఇచ్చినప్పటికీ.. అది తాత్కాలికమే.
దాదాపు నెలన్నర రోజులకు పైగా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు భగభగమంటూ మండిపోతూ వస్తోన్నాయి. కరోనా వైరస్ సంక్షోభ సమయాన్ని కూడా లెక్క చేయట్లేదు చమురు సంస్థలు. లాక్డౌన్ తరహా పరిస్థిితుల వల్ల సాధారణ ప్రజల రోజువారీ జీవనం అస్తవ్యస్తమైంది. దీనికి తోడుగా పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత భారంగా పరిణమించాయి.
జీడీపీలో పెట్రో వాటా..
దేశ స్థూల జాతీయోత్పత్తి ప్రస్తుతం 7.3 శాతానికి కాస్త అటూ, ఇటూగా ఉంటోంది. కరోనా వైరస్ వల్ల విధించిన ఆంక్షలు.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఏ రాష్ట్రం కూడా లాక్డౌన్ తరహా పరిస్థితుల నుంచి బయటికి రాలేదు. థర్డ్వేవ్ సంభవించే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో- మరోసారి పాజిటివ్ కేసులు పెరగడమంటూ జరిగితే మరిన్ని ఆంక్షలను విధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తన రోజువారీ ఆదాయాన్ని పెంచుకోవడానికే పెట్రోల్, డీజిల్ ధరలను క్రమం తప్పకుండా పెంచుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
పరిశ్రమల మాటేంటీ..ఇక్రా ఏం చెబుతోంది?
ఇదివరకెప్పుడూ లేనివిధంగా ఇంధన ధరలను పెరుగుతోండటం పరిశ్రమలను ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయమని ఇక్రా అంచనా వేస్తోంది. సీఐఐ వంటి పారిశ్రామిక సంఘాలు సైతం ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తోన్నాయి. ప్రభుత్వ ఆదాయం కోసమే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సిన పరిస్థితే వస్తే.. దానికి ఎలాంటి ఆటంకం కలగకుండా సెస్ రూపంలో ఇంధన ధరలను నాలుగున్నర రూపాయల వరకు తగ్గించవచ్చని ఇక్రా ఉపాధ్యక్షుడు ప్రశాంత్ వశిష్ఠ్ పేర్కొన్నారు.
ఏఐఎంటీసీ వాదనేంటీ?
ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రజలు బయట తిరగడం మానేస్తారని, దాని వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుల్తారామ్ సింగ్ అట్వాల్ అన్నారు. తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, వాటిపై ఆధారపడిన దినసరి వేతన కార్మికుల జీవితాలు అస్తవ్యస్తమౌతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతోన్న ఇంధన ధరలను వ్యతిరేకిస్తూ త్వరలోనే దేశవ్యాప్త ఆందోళనలను చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ట్రక్ ఆపరేటింగ్లో 70 శాతం మేర ఖర్చు పెరుగుతోందని పేర్కొన్నారు. దీన్ని భరించే శక్తి మార్కెట్ మీద కూడా లేదని అన్నారు.