PM CARES fund: చమురు కంపెనీలు రూ.1,000 కోట్లు, కళ్యాణ్ జ్యువెల్లర్స్ రూ.60 కోట్లు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి వ్యాపార, పారిశ్రామిక వర్గాలు అండగా నిలుస్తున్నాయి. రిలయన్స్, మహీంద్రా, సన్ ఫార్మా, రతన్ టాటా, హ్యుండాయ్, హీరో, హోండా, బజాజ్, వేదాంత, ఎల్ అండ్ డీ, హీరో, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, పేటీఎం, ఎన్ఎండీసీ, అమర్రాజా, సిగ్నిటీ, మ్యాన్కైండ్, ఎన్సీసీ కోట్లాది రూపాయల సాయం చేస్తున్నాయి. టాటా గ్రూప్ రూ.1500 కోట్లు, అదానీ, జిందాల్, వేదాంత, హీరో కంపెనీలు చెరీ రూ.100 కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పీఎం కేర్స్ ప్రత్యేక నిధికి కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి.
టాటా నుండి అంబానీ వరకు కరోనాపై పోరుకు భారీ విరాళాలు, ధరలూ తగ్గించారు
పీఎం కేర్స్కు విరాళాల వెల్లువ
పీఎం కేర్స్ ప్రత్యేక నిధికి రిలయన్స్ రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు రిలయన్స్ తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి చెరో రూ.5 కోట్లను కేటాయించింది. ఎల్ అండ్ టీ పీఎం కేర్స్కు రూ.150 కోట్లు ప్రకటించింది. లౌక్డౌన్ సమయంలో ఎల్ అండ్ టీ తన కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు అందించనుంది. ఇందుకు ప్రతి నెలా రూ.500 కోట్లను పక్కన పెట్టనున్నట్లు తెలిపింది.
పేటీఎం రూ.500 కోట్లు, ఫోన్పే రూ.100 కోట్లు
పేటీఎం పీఎం కేర్స్ సహాయనిధికి రూ.500 కోట్లు అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఈ మొత్తాన్ని విరాళాల ద్వారా సేకరించనుంది. తోటి పౌరుల నుండి విరాళాలు అందించాలని సంస్థ కోరింది. కస్టమర్లు ఇచ్చే ప్రతీ రూ.10కి అదనంగా తాము రూ.10 కలుపి పీఎం కేర్స్కు అందిస్తామని తెలిపింది. రూ.100 కోట్లు సేకరించి తాము పీఎం కేర్స్ నిధికి అందిస్తామని ఫోన్పే తెలిపింది. తమ సబ్స్క్రైబర్లు చెల్లించే ప్రతి విరాళానికి రూ.10 జత చేస్తామని పేర్కొంది.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రూ.100 కోట్లు
పీఎం కేర్స్ నిధికి రూ.50 కోట్లను విరాళం ఇస్తున్నట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. మరో రూ.50 కోట్లను నివారణ చర్యల కోసం సొంతగా ఖర్చు చేయనుంది. ఎన్ఎండీసీ రూ.150 కోట్లు పీఎంకేర్స్ ఫండ్కు అందించింది.
అమర్రాజా రూ.6 కోట్లు
కరోనా వ్యాప్తి నియంత్రణకు అమర్రాజా గ్రూప్రూ.6 కోట్ల విరాళం ప్రకటించింది. ఇందులో కంపెనీ ఉద్యోగుల ఒకరోజు వేతనం కూడా కలిపి ఉందని తెలిపింది. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.5 కోట్లు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.కోటి అందిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్కు చెందిన సాఫ్టువేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్ తెలంగాణ ప్రభుత్వ కరోనా సహాయ నిధికి రూ.50 లక్షలు ఇచ్చింది. మ్యాన్కైండ్ ప్రభుత్వాలకు రూ.51 కోట్లు అందించింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి రూ.3 కోట్లు, ఏపీ ప్రభుత్వానికి రూ.1 కోటి అందించింది.
కళ్యాణ్ జ్యువెల్లర్స్ రూ.10 కోట్లు
బలహీన వర్గాలకు ఆహారంతో పాటు నిత్యావసర వస్తువులు అందించేందుకు రూ.10 కోట్లు కేటాయించినట్లు కళ్యాణ్ జ్యువెల్లర్స్ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో స్థానిక, ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో నిరుపేదలకు ఆహార, ఇతర నిత్యావసరాలను అందిస్తామని సంస్థ సీఎండీ టీఎస్ కల్యాణరామన్ ఓ ప్రకటనలో చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నాయని, ఐనప్పటికీ మార్చి, ఏప్రిల్ నెలల్లో తమ 8వేలమంది ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇస్తామని తెలిపింది.
కొటక్ మహీంద్రా రూ.60 కోట్లు
కొటక్ మహీంద్రా బ్యాంకు, బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కొటక్ కలిపి రూ.60 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. పీఎం కేర్స్ నిధికి బ్యాంకు తరఫున రూ.25 కోట్లు, వ్యక్తిగతంగా రూ.25 కోట్లు అందించనున్నట్లు ఉదయ్ ట్వీట్ చేశారు. మరోరూ.10 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామన్నారు.
ఆయిల్ కంపెనీలు రూ.1,000 కోట్లు
ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు అన్నీ కలిపి రూ.1,000 కోట్లు పీఎంకేర్స్కు అందించనున్నాయి. అలాగే, తమ కంపెనీలో పని చేసే డెలివరీ ఉద్యోగులు ఎవరికైనా కరోనా సోకి చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వనుంది. IOCL, BPCL, HPCL కలిపి రూ.వెయ్యి కోట్లు ఇవ్వనున్నాయి. ప్రభుత్వ రంగ ఎన్ఎండీసీ రూ.150 కోట్లు ఇచ్చింది.