IPO: మార్కెట్లోకి మరో ఐపీవో.. ఫేమస్ విస్కీ బ్రాండ్.. పూర్తి వివరాలు..
IPO: ఆఫీసర్స్ ఛాయిస్(Officer's Choice) విస్కీని తయారుచేసే అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐపీవో ద్వారా మార్కెట్లోకి రాబోతోంది. IPO ద్వారా రూ.2,000 కోట్లను సమీకరించడానికి సెబీకి కంపెనీ ఇప్పటికే డ్రాఫ్ట్ పేపర్స్ దాఖలు చేసింది. ఐపీవో ద్వారా సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ రుణాల చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
ప్రమోటర్ల వాటా విక్రయం..
IPOలో రూ.1,000 కోట్ల కొత్త ఇష్యూతో పాటు రూ.1,000 కోట్ల విలువైన ప్రమోటర్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నట్లు కంపెనీ తన డ్రాఫ్ట్ పత్రాల్లో వెల్లడించింది. ఈ ఐపీవోను ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, JM ఫైనాన్షియల్స్ నిర్వహించనున్నాయి. రూ.500 కోట్ల వరకు విలువైన షేర్లను ABD సహ-ఛైర్పర్సన్ బీనా కిషోర్ ఛబ్రియా ఆఫ్లోడ్ చేస్తారు. ఇదే సమయంలో ప్రమోటర్లు రేషమ్ ఛబ్రియా జీతేంద్ర హేమ్దేవ్, నీషా కిషోర్ ఛబ్రియాలు ఒక్కొక్కరు రూ.250 కోట్ల విలువైన వాటాలను విక్రయిస్తారు.
ఏఏ ఇన్వెస్టర్లకు ఎంత..
ఈ ఆఫర్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా అందించబడుతోంది. ఐపీవోలో 50 శాతం షేర్లను ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం షేర్లను నాన్ ఇన్ స్టిట్యూషనల్ బిడ్డర్లకు అందుబాటులో ఉంచగా.. మిగిలిన 35 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఐపీవోలో కేటాయించింది.
కంపెనీ లాభాలు ఇలా..
అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ దేశంలో అతిపెద్ద స్వదేశీ ఆల్కహాల్ కంపెనీగా ఉంది. ఇది డియాజియో, పెర్నోడ్ రికార్డ్ తర్వాత మూడవ స్థానంలో ఉంది. దీనికి దేశంలోని 25 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీల్లో వ్యాపారం కలిగి ఉంది. ఇది స్టెర్లింగ్ రిజర్వ్, ఆఫీసర్స్ ఛాయిస్ వంటి విస్కీ, బ్రాందీ రమ్, వోడ్కా, అలాగే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి 10 ప్రధాన బ్రాండ్లను కలిగి ఉంది. 2021 ఆర్థిక సంవత్సరం కంపెనీ లాభాలు దెబ్బతిన్నాయి. 2020 సంవత్సరంలో రూ.12.97 కోట్ల లాభాన్ని ఆర్జించిన సంస్థ.. 2021లో కేవలం రూ.2.51 కోట్లను లాభాన్ని నమోదు చేసింది.