ప్రశాంత్ కిషోర్కు రూ.37 కోట్లు ఇచ్చిన జగన్, చంద్రబాబు హెలికాప్టర్కు రూ.9 కోట్లు!
అమరావతి: ఎన్నికల్లో విజయం కోసం ఆయా పార్టీలు రాజకీయ వ్యూహకర్తలను ఆశ్రయిస్తాయి. ఇటీవలి కాలంలో ఎన్నికల స్ట్రాటజీలో దిట్టగా పేరొందిన వారిలో ప్రశాంత్ కిషోర్ ముఖ్యులు. 2014లో ఆయన బీజేపీకి పని చేశారు. అప్పటి నుంచి ఆయా బాగా వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్ నేతృత్వంలోని వైసీపీకి పని చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు వెనుక ఆయన పాత్ర కూడా ఉంది. ఇందుకు ఆయనకు లేదా ఆయన నేతృత్వంలోని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-PAC)కు వైసీపీ కోట్లాది రూపాయలు చెల్లించిందట.
ఏపీకి జగన్ గుడ్న్యూస్: ఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే.. కారు, ఇల్లు, ఆదాయం...
ఎన్నికల తేదీలు ప్రకటించాక రూ.221 కోట్ల విరాళాలు
ఏపీలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్, జనసేన.. ఇతర పార్టీలు 2019 ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టారు. ఇందుకు సంబంధించిన లెక్కలు ఎన్నికల కమిషన్కు ఇస్తారు. ఎన్నికల వ్యయంపై వైసీపీ ఈసీకి నివేదిక సమర్పించింది. దీని ప్రకారం.... ప్రశాంత్ కిషోర్ I-PACకు రూ.37.5 కోట్లు (37,57,68,966) చెల్లించింది. ఎన్నికల షెడ్యూల్ప్రకటించే నాటికి తమ వద్ద రూ.74 లక్షలు ఉన్నాయని, ఎన్నికల తేదీలు ప్రకటించిన అనంతరం విరాళాల రూపంలో రూ.221 కోట్లు (రూ.(221,58,52,225) వచ్చాయని తెలిపింది.
ఎన్నికల్లో రూ.85 కోట్లు ఖర్చు
ఎన్నికల్లో రూ.85 కోట్లు (రూ.85,65,18,694) ఖర్చు చేసినట్లు తెలిపింది. ఇందులో రూ.9.7 కోట్లు (9,72,21,777) స్టార్ క్యాంపెయినర్లకు, రూ.36 కోట్లు (36,44,34,267) వివిధ మీడియా సంస్థలకు చెల్లించినట్లు తెలిపింది. ఇందులో ఎక్కువగా.. అంటే రూ.24 కోట్లు ((24,67,34,007) జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్కు వెళ్లినట్లు తెలిపింది. మరో రూ.1.03 కోట్లు (1,03,21,544) పోస్టర్లు, బ్యానర్లు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు, హోర్డింగ్స్ కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. ఖర్చుల అనంతరం రూ.138 కోట్లు (138,58,28,365) మిగిలినట్లు పేర్కొంది. స్క్రాప్ విక్రయించడం ద్వారా రూ.33వేలు వచ్చినట్లు పేర్కొంది.
వైసీపీకి వచ్చిన విరాళాలు ఇలా...
అలాగే, గత నెలలో ఎన్నికల కమిషన్కు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ను వైసీపీ సమర్పించింది. ఇందులో... రూ.181 కోట్లు (181,07,92,658) విరాళాల ద్వారా వచ్చినట్లు తెలిపింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా రూ.99 కోట్లు (99,84,00,000) అందినట్లు తెలిపింది. నాన్ కార్పోరేట్ సంస్థల ద్వారా రూ.36.08 కోట్లు (36,08,18,258) విరాళాలు వచ్చాయని పేర్కొంది. అంతకుముందు ఏడాది వీటి నుంచి రూ.11.7 కోట్లు వచ్చాయి. ఇక కార్పోరేట్ కంపెనీల నుంచి రూ.18 కోట్లు (18,15,74,400) వచ్చినట్లు తెలిపింది. గత ఏడాది ఈ విరాళాలు రూ.2.53 కోట్లుగా ఉంది.
టీడీపీ ఎన్నికల ఖర్చు రూ.77 కోట్లు
మరోవైపు, ఎన్నికల తేదీలు ప్రకటించే నాటికి తమ వద్ద రూ.102 కోట్లు ఉన్నట్లు టీడీపీ తెలిపింది. తేదీలు ప్రకటించాక విరాళాల రూపంలో రూ.131 కోట్లు వచ్చాయి. చంద్రబాబు ఎన్నికల ప్రచారం కోసం రూ.9 కోట్లకు హెలికాప్టర్లను అద్దెకు తీసుకున్నట్లు తెలిపింది. మొత్తంగా టీడీపీ ఎన్నికల్లో రూ.77 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఇందులో రూ.49 కోట్లు మీడియా పబ్లిసిటీకు ఖర్చు చేసింది. ఖర్చు అనంతరం టీడీపీ వద్ద రూ.155 కోట్లు ఉంది.
టీఆర్ఎస్, మజ్లిస్ ఖర్చు ఎంతంటే?
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో రూ.29 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. విరాళాల రూపంలో రూ.188 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. మజ్లిస్ పార్టీ రూ.71,961 మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపింది.