EMI కట్టలేక, చిల్లి గవ్వలేక.. ఇప్పుడేం చేయాలి: హఠాత్తుగా ఉద్యోగంపోయి రోడ్డుపాలు
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 24వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రకటించారు. దీనిని పొడిగిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. వ్యాపారాలు నిలిచిపోవడంతో చాలామంది నిరుద్యోగులుగా మారారు. వివిధ సంస్థలు, దుకాణాలు తమ తమ వద్ద పని చేసే ఉద్యోగులను హఠాత్తుగా తొలగించాయి. వ్యాపారాలు లేక ఆదాయం లేకుండా పోయింది. దీంతో వారు కూడా ఏం చేయలేని పరిస్థితి. మరోవైపు చాలామంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
10ఏళ్లలో వచ్చిన ఉద్యోగాలన్నీ హుష్కాకీ, అమెరికా ఆర్థిక పరిస్థితి ఎంత దారుణమంటే?
ఉద్యోగం పోవడంతో ఈఎంఐ బాధ
ఉద్యోగం పోవడం లేదా వేతనం కట్ కావడంతో చాలామంది ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదాహరణకు ఓ ఐటీ కంపెనీలో పని చేసే వికాస్తో పాటు అతని సహచరులను పదుల సంఖ్యలో తొలగించారు. వికాస్ తన కుటుంబంతో కలిసి నెల వేతనం వస్తుండటంతో పెద్దగా ఇబ్బందులు లేకుండా సాఫీగా జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగం ఉందనే ధైర్యంతో ఓ ఫ్లాట్ కొన్నాడు. దానికి ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఉద్యోగం పోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలా చాలామంది బాధితులు ఉన్నారు.
పరిస్థితి రోడ్డుపాలు
చాలామంది తమకు వచ్చే వేతనాన్ని లెక్కలు వేసుకొని నెల ఖర్చుకు వచ్చేలా ఉపయోగించుకుంటారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులు, ఇల్లు లేదా ఫ్లాట్ లేదా వాహనం తీసుకుంటా వాటికి సంబంధించిన ఈఎంఐలు.. ఇలా అన్నింటికి కలిపి తమ శాలరీలో 80 శాతం వరకు అవసరమైతే అంతకంటే ఎక్కువ ఉపయోగిస్తారు. కానీ అలాంటి వారికి ఉద్యోగం పోవడంతో ఇప్పుడు వారి పరిస్థితి రోడ్డున పడినట్లే!
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు
తనకు మొదట వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారని, ఆ తర్వాత ఉద్యోగం నుండి తొలగించారని వికాస్ ఓ టీవీ ఛానల్తో ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నానని, కానీ తమలాంటి వారికి సహాయం చేసేందుకు ఎలాంటి రూల్స్ లేవని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అతని తల్లిదండ్రులు ఒడిశాలోని సొంత ఊళ్లో ఉండిపోయారు. పిల్లల స్కూల్ ఫీజు, ఈఎంఐలు చెల్లించడానికి ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్నందున కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే పరిస్థితి కూడా లేదు.
ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ
ఉద్యోగాలు పోయిన వారి బాధ వర్ణణాతీతం. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. కొంతమందికి ఉద్యోగం పోవడంతో ఇన్నాళ్లు చేసిన సేవింగ్స్ను ఖర్చు చేస్తున్నారు. అవి కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి. మరికొందరికి చేతిలో డబ్బులు ఉద్యోగం లేక ఇంటిలో అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యులను చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇంటి ఖర్చులకు డబ్బులు లేక ఉద్యోగం లేక ఏం చేయాలో అర్థం కావడం లేదని ఎంతోమంది ఆవేదన చెందుతున్నారు. స్కూల్ ఫీజులు, ఇంటి రెంట్, ఈఎంఐ కట్టలేక, మెడిసిన్స్ కొనలేక, ఇంటికి అవసరమైన వస్తువులు కొనలేక.. ఎంతోమంది కేవలం మంచి నీళ్లు తాగి ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయట. ప్రభుత్వం ఇచ్చే రేషన్ పైనే చాలామంది ఆధారపడి జీవిస్తున్నారు.
పెరుగుతున్న నిరుద్యోగ సమస్య
ఉత్పత్తి - డిమాండ్ తగ్గిపోవడంతో నిరుద్యోగుల సమస్య పెరుగుతుంది. కరోనా, లాక్ డౌన్ కారణంగా భారత్లో నిరుద్యోగిత రేటు భారీగా పెరుగుతుందని వివిధ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కేవలం భారత్లోనే కాదు. అమెరికాలో అయితే ప్రతి ఆరుగురిలో ఒకరికి ఉద్యోగం లేని పరిస్థితి వచ్చింది. అగ్రదేశాల నుండి అందరిదీ ఇదే పరిస్థితి.