Crorepati Employees: ఆ కంపెనీల్లో కోటీశ్వరులైన ఉద్యోగులు.. ఈ లిక్కర్ కంపెనీలోనే ఉద్యోగులు ఎక్కువగా.. ఎంతమందంటే
Crorepati Employees: గత సంవత్సరం ఖర్చులను ఆదా చేసేందుకు అనేక కంపెనీలు ఉద్యోగుల కోతను పాటించాయి. కానీ.. హిందూస్థాన్ యూనిలీవర్, ITC, యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీల్లో ఎనిమిది అంకెల జీతం పొందే ఉద్యోగుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది.
రాజీనామాల తరుణంలో..
కరోనా తరువాత అనేక కంపెనీలు ఉద్యోగుల రాజీనామాలతో గ్రేట్ రిసిగ్నేషన్ తో పాటు అధిక అట్రిషన్ రేటుతో పోరాడుతున్నాయి. ఇదే సమయంలో HUL, ITC, USL కంపెనీల్లో కలిసికట్టుగా కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి క్లబ్లో 130 మంది ఎగ్జిక్యూటివ్లను చేర్చుకున్నాయి.
పెరిగిన కోటీశ్వరుల సంఖ్య..
FY22లో కోటీశ్వరుల ఉద్యోగుల సంఖ్య ఈ మూడు కంపెనీలు పెంచాయి. కోటి రూపాయలు జీతంగా అందుకుంటున్న ఉద్యోగుల సంఖ్య.. ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం HUL 33 శాతం; సిగరెట్లు, వ్యవసాయం, పేపర్ వ్యాపారంలో మార్కెట్ లీడర్ ITC 44 శాతం; దేశంలో అతిపెద్ద స్పిరిట్స్ కంపెనీ USL 113 శాతం పెరిగినట్లు తెలిపాయి.
ఏఏ కంపెనీల్లో ఎంతమంది..
ITC కంపెనీలో 220 మంది, హిందూస్థాన్ యూనిలీవర్ కంపెనీలో 163 మంది, యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీలో 49 మంది కోటి జీతంగా అందుకుంటున్న ఉద్యోగులను కలిగి ఉన్నాయి. హూమన్ రిసోర్సెస్ సంస్థ ABC కన్సల్టెంట్స్ ఈ విషయాలను నివేదించింది.
దీనివెనుక కారణాలు ఇవే..
కరోనా తరువాత ఉద్యోగులు ఎక్కువగా రాజీనామాలు చేస్తుండటంతో అత్యంత పోటీతత్వ ఉన్న మార్కెట్లో ప్రతిభ కలిగిన ఉద్యోగులను ఆకర్షించేందుకు కంపెనీలు ఇలా చేసినట్లు తెలుస్తోంది. అయితే యునైటెడ్ స్పిరిట్స్, ఐటీసీ కంపెనీల్లో గత సంవత్సరం సీనియర్ ఎగ్జిక్యూటివ్ల సంఖ్య పెరగడం వల్ల వారి సగటు వేతనం 7-8 శాతం మధ్య పెరిగినట్లు తెలుస్తోంది. స్టార్టప్లు, డైరెక్ట్-టు-కన్స్యూమర్ సంస్థల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడానికి అధిక పోటీ ఉండటం కూడా మరో కారణంగా ఉంది.
కంపెనీలు మారుతున్న ఉద్యోగులు..
ఉదాహరణకు.. సుధీర్ సీతాపతి గతంలో HULలో ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గత సంవత్సరం గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్గా చేరారు. HULలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న ప్రభా నరసింహన్ను కోల్గేట్ పామోలివ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా చేసింది.