అదాని కంపెనీలకు రూ. వేల కోట్లు లబ్ది: ఎన్టీపీసీ బొగ్గు కాంట్రాక్ట్స్ అక్కడికే
ముంబై: గుజరాత్కు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆస్తుల విలువ వంద బిలియన్ డాలర్లను దాటింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ప్రకారం..ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానిది తొమ్మిదో స్థానం. గౌతమ్ అదాని, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 100.4 బిలియన్ డాలర్లు. బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ను పరిగణనలోకి తీసుకున్నా..అదాని ఆస్తుల విలువ 98.4 బిలియన్ డాలర్లు.
ఆసియా వరకు చూసుకుంటే అత్యంత సంపన్న వర్గాల జాబితాలో గౌతమ్ అదాని రెండోస్థానంలో కొనసాగుతున్నారు. తొలి స్థానం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీదే. అలాంటి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల మేర లబ్ది కలుగుతోంది.. బొగ్గు దిగుమతులతో. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ బొగ్గు దిగుమతుల కాంట్రాక్ట్స్లో మెజారిటీ వాటా అదాని ఎంటర్ప్రైజెస్దే.
6.25 మిలియన్ టన్నుల ఎన్టీపీసీ బొగ్గు కాంట్రాక్ట్ను అదాని ఎంటర్ప్రైజెస్ దక్కించుకుంది. దీని విలువ 6,585 కోట్ల రూపాయలు. దేశీయంగా నెలకొన్న కొరతను అధిగమించడానికి 10 శాతం మేర విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ- ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంట్రాక్ట్ను దక్కించుకోవడానికి మొత్తంగా ఆరు కంపెనీలు పోటీ పడినప్పటికీ.. అది మాత్రం అదాని ఎంటర్ప్రైజెస్ వశమైంది.
అహ్మదాబాద్కు చెందిన ఆది ట్రేడ్లింక్, చెన్నైకి చెందిన చెట్టినాడ్ లాజిస్టిక్స్, ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న మోహిత్ మినరల్స్ లిమిటెడ్ నుంచి టెక్నికల్ బిడ్స్ దాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా మార్చిలో కొరత ఏర్పడిన సమయంలో 5.75 మిలియన్ టన్నుల మేర బొగ్గును దిగుమతి చేసుకోవడానికి దాఖలు చేసిన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా అదాని ఎంటర్ప్రైజెస్కే దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదానికి సొంతంగా ఆస్ట్రేలియాలో క్యార్మికెల్ కోల్ మైన్ ఉంది. దీని ఉత్పాదక సామర్థ్యం సంవత్సరానికి 10 మిలియన్ టన్నులు.