అదానీకి సెక్యూరిటీస్ డిపాజిటరీ షాక్, గంటలో రూ.55వేల కోట్ల నష్టం
ముంబై: అదానీ గ్రూప్స్ కంపెనీ గౌతమ్ అదానీకి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్కు చెందిన కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్పోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను NSDL స్తంభింపచేసింది. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో స్టాక్ ఎక్స్చేంజీలో అదానీ గ్రూప్ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి. గంట వ్యవధిలోనే లోయర్ సర్క్యూట్ను తాకడంతో నికర సంపద రూ.55వేల కోట్ల మేరకు పడిపోయింది.
NSDL స్తంభింపజేసిన అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, APMS ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కు అదానీ గ్రూప్లోని నాలుగు కంపెనీల్లో రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. అయితే మనీలాండరింగ్ నివారణ చట్టం ప్కారం ఈ ఖాతాల యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. దీంతో మే 31వ తేదీన లేదా అంతకు ముందు ఈ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఖాతాలు స్తంభించడంతో ఈ ఫండ్స్ పాత సెక్యూరిటీలని అమ్మడం లేదా కొత్త సెక్యూరిటీస్ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు.
కొత్త మార్కెట్ నిబంధనల ప్రకారం FPI కస్టమర్ డాక్యుమెంటేషన్ వెల్లడించడం తప్పనిసరి. అంటే ఫండ్ మేనేజర్స్, కామన్ ఓనర్షిప్ వంటి వివరాలు వెల్లడించాలి. లేదంటే వారి డీమ్యాట్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తారు. అదానీ గ్రూప్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ వివరాలు వెల్లడించకపోవడంతో FPIs ఖాతాలను నిలిపివేశారు. తాజా దెబ్బతో అదానీ గ్రూప్ కంపెనీల్లోని అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 25 శాతం పతనం అయింది. అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు కూడా పతనమయ్యాయి.