నోట్ల రద్దు, ఉపసంహరణ మధ్య తేడా ఏంటి ? 2 వేల నోటుపై RBI ఏం చెప్తోంది...
2000 withdraw: రెండు వేల రూపాయలు విలువైన కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు RBI ప్రకటించింది. కేంద్ర బ్యాంకు సర్క్యులర్ ను సరిగా అర్థం చేసుకోవడంలో కొందరు విఫలం అవుతున్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దుకు, ఉపసంహరణకు భారీ తేడా ఉన్నట్లు గమనించాల్సి ఉంటుంది. ఎట్టకేలకు రద్దే ఉద్దేశమైనా, ఓ పద్ధతి ప్రకారం ఈ ప్రక్రియ జరగనుంది. వాటిమద్య తేడాలేంటో పూర్తిగా తెలుసుకుందాం..
నవంబర్ 8, 2016న పెద్ద నోట్లైన వెయ్యి, ఐదు వందల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. అంటే అవి చట్టబద్ధంగా ఆ క్షణం నుంచి చెల్లుబాటు కావని అర్థం. బ్యాంకుల వద్ద మినహా బయట ఆయా నోట్లకు అప్పటి నుంచి విలువ లేదు. అవి కేవలం ఓ కాగితం ముక్కగా మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. అయితే వాటిని మార్చుకోవడానికి ప్రజలకు కొంత కాలంపాటు అవకాశం కల్పించారు. అనంతరం అవి ఎక్కడా చెల్లుబాటు కావు.
'
మే 19, 2023న చలామణిలో ఉన్న పెద్ద నోటు 2 వేలను ఉపసంహరించుకుంటున్నట్లు RBI తెలిపింది. దీని అర్థం రద్దు కాదు. ఆ సంస్థ వైపు నుంచి ఈ నోటును ముద్రించడం నిలిపివేస్తున్నట్లు అఫీషియల్ గా చెప్పడం. బాహ్య మార్కెట్ లోని 2 వేల నోట్లను ఇచ్చిన గడువు తేదీ సెప్టెంబరు 30, 2023 లోపు బ్యాంకుల ద్వారా తిరిగి RBI తన చేతుల్లోకి తీసుకోవడం ఈ నిర్ణయం వెనుక దాగి ఉన్న అర్ధం. ఏవైనా కారణాల వల్ల ఆ వ్యవధి లోపు ఈ నోట్లను ప్రజలు మార్చుకోకపోయినా అవి చెల్లుబాటు అవుతాయి. దైనందిన ఖర్చుల కోసం వాటిని వినియోగించవచ్చు.
'క్లీన్ నోట్ పాలసీ'లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు పేర్కొంది. చలామణిలో ఉన్న నకిలీ నోట్లకు చెక్ పెట్టడమే ఉద్దేశంగా 2016లో మొదటి ఫేజ్ అమలు చేయగా, తాజా నగదు ఉపసంహరణను రెండో ఫేజ్ గా భావించవచ్చు. గతంలో పాటించిన నోట్ల రద్దు విధానం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు.
తాజాగా RBI తీసుకున్న నిర్ణయంతో మరో వాదన తెరపైకి వచ్చింది. గతంలో రద్దు చేసిన వెయ్యి రూపాయల నోట్లను తిరిగి చలామణిలోనికి తీసుకువస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంకు ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి వదంతులను నమ్మాల్సిన అవసరం లేదని గమనించాలి.