కొత్త ఏడాదిలో గ్యాస్ ధర మరింత భారం, ఆగస్ట్ నుంచి రూ.140 పెరుగుదల
ప్రభుత్వ సబ్సిడీ కింద కుటుంబానికి ఏడాదికి 14.2 కిలోల సిలిండర్లు 12 వస్తాయి. ఇవి కాకుండా ఎక్కువ సిలిండర్లు కావాలంటే మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందే. నాన్ సబ్సిడీ ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) లేదా కుకింగ్ గ్యాస్ సిలిండర్ ధరలు జనవరి 1, 2020 నుంచి స్వల్పంగా పెరిగాయి. ఎల్పీజీ ధరలు పెరగడం ఇది వరుసగా ఐదో నెల.
LPG డిస్ట్రిబ్యూటర్షిప్ ప్రమాణాలు: అర్హత, దరఖాస్తు ప్రక్రియ.. పూర్తి వివరాలు
ఢిల్లీ, ముంబైలలో రూ.19 పెరుగుదల
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకారం ఒక్కో సిలిండర్కు ఢిల్లీలో రూ.19, ముంబైలో రూ.19.50 పెరిగింది. ధరల సమీక్ష అనంతరం సబ్సిడీ లేని సిలిండర్ ధర ఢిల్లీలో రూ.714, ముంబైలో రూ.684.50గా ఉంది. డిసెంబర్ నెలలో ఈ ధర ఢిల్లీలో రూ.695, ముంబైలో రూ.665గా ఉంది.
కోల్కతా, చెన్నైలలో ధర
కోల్కతా, చెన్నైలలో నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు వరుసగా రూ.21.5, రూ.20 పెరిగింది. దీంతో కోల్కతాలో ఒక సిలిండర్ ధర రూ.747 కాగా, చెన్నైలో రూ.734కు పెరిగింది. డిసెంబర్ నెలలో కోల్కతాలో రూ.725.50, చెన్నైలో రూ.714గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో కొద్ది నెలలుగా ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాదులో జూలైలో రూ.103 తగ్గగా, ఆగస్ట్లో రూ.62 తగ్గింది. సెప్టెంబర్లో రూ.16, అక్టోబర్లో రూ.13.50, నవంబర్లో రూ.56.50 పెరిగింది. డిసెంబర్లో రూ.34 పెరిగింది. విజయవాడలో జూలైలో రూ.101 తగ్గగా, ఆగస్ట్లో రూ.61.50 తగ్గింది. సెప్టెంబర్లో రూ.16, అక్టోబర్లో రూ.13, నవంబర్లో రూ.76, డిసెంబర్లో రూ.19 పెరిగింది.
ఆగస్ట్ నుంచి ఎంత పెరిగిందంటే?
డిసెంబర్ 1వ తేదీ నుంచి 19 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,241, ముంబైలో రూ.1,190గా ఉంది. ఆగస్ట్ 2019 నుంచి ఢిల్లీలో సిలిండర్ ధర రూ.139.50 లేదా 24.28 శాతం, ముంబైలో రూ.138 లేదా 25.25 శాతం పెరిగింది. ప్రభుత్వం ఒక్కో ఇంటికి సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీ కింద ఇస్తుంది. ఇవి 14.2 కిలోల సిలిండర్లు. 12 కంటే ఎక్కువ కావాలంటే మాత్రం మార్కెట్ ధరను చెల్లించాల్సిందే.