ఉల్లంఘన ఎలా అవుతుంది: చైనాకు భారత్ ధీటుగా సమాధానం
నిర్దిష్ట దేశాల నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) రాకుండా తీసుకు వచ్చిన నిబంధనలపై డ్రాగన్ దేశం చైనా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి భారత్ కూడా ధీటుగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా తాము ఏమీ చేయలేదని, తమ నియమాలు అనుమతి తిరస్కరణ కిందకు రావని, ఆమోద ప్రక్రియ మాత్రమేనని, ఇందులో ఎలాంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉల్లంఘనలు లేవని తేల్చి చెప్పింది.
చైనా అసహనం.. అందుకే ఇండియా స్పందన
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని సవరణలు చేసింది. భారత్తో సరిహద్దు ఉన్న దేశాలు ఆటోమెటిక్గా టేకోవర్ తీసుకోవడం కుదరదని తెలిపింది. భారత్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే దానికి ఆటోమెటిక్ టేకోవర్ విధానం కుదరదని, కేంద్రం అనుమతితో సరిహద్దు దేశాలు పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అవకాశవాదంగా మారిన ఎఫ్డీఐ విధానాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంది. దీనిని చైనా తప్పుపట్టింది. కొత్త విధానం స్వేచ్ఛ వాణిజ్యానికి వ్యతిరేకంగా ఉందని చైనా అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానంలో చైనా గురించి స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ దాని ప్రభావం మాత్రం తమ పెట్టుబడిదారులపై స్పష్టంగా కనిపిస్తోందని చైనా ఎంబసీ ప్రతినిధి తెలిపారు. ఇలా అదనపు గోడలు సృష్టించడం డబ్ల్యుటీవో నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు. దీంతో ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.
వాణిజ్యంపై ప్రభావం చూపదు
డబ్ల్యుటీవో కింద వివిధ ఒప్పందాలను ప్రభుత్వ చర్య ఎలా ప్రభావితం చేస్తుందనే అంచనాలను వెల్లడించాయి. ఇది పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న చర్య అని, వస్తువుల వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది. ఇది ఎలాంటి ఈక్విటీ క్యాప్, పరిమితులకు కారణం కాదని, అధికారికంగా భిన్నమైన విధానాన్ని సూచిస్తుందని చెబుతున్నారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫెక్ట్.. కఠినతరం
ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇతర దేశాలు భారత కంపెనీల్లో వాటాలు చేజిక్కుంచుకోకుండా కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో హెచ్డీఎఫ్సీలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 1.01 శాతం వాటాను చేసింది. దీంతో ఎఫ్డీఐ నిబంధలను కేంద్రం కఠినతరం చేసింది.