ఇన్ఫోసిస్పై H1B వీసా కొత్త రూల్స్ ప్రభావం ఉంటుందా.. అంటే?
ఇటీవల అమెరికా తన H1B వీసా పథకంలో తీసుకు వచ్చిన షరతు ప్రభావం తమ కంపెనీపై ఉండదని ఇన్ఫోసిస్ సీవోవో ప్రవీణ్ రావు అన్నారు. గత మూడేళ్లలో అమెరికాలోని కళాశాలలు, యూనివర్సిటీల నుండి స్థానికంగా నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కాలంలో అమెరికాలో 13,000 మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా విధానాన్ని మరింత కఠినతరం చేశారు. అమెరికన్ల ఉద్యోగాలను రక్షించేందుకు వీసా నిబంధనల్లో మార్పులు చేశారు. అయితే ఈ కొత్త నిబంధనల ప్రభావం తమపై ఉండదని ఇన్ఫోసిస్ తెలిపింది.
హెచ్1బీ షరతుల ప్రభావం
ఇండియన్ రెండో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బుధవారం సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభంతో పోలిస్తే 20 శాతానికి పైగా వృద్ధి సాధించింది. ఫలితాల సందర్భంగా ఉద్యోగాలు, హెచ్1బీ అంశాలపై ప్రవీణ్ రావు స్పందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్లో 16,500 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని, వచ్చే ఏడాది కూడా 15వేల మంది ఫ్రెషర్స్ను తీసుకుంటామన్నారు. అదే సమయంలో హెచ్1బీ షరతుల ప్రభావం కంపెనీపై ఉండదని చెప్పారు.
జూనియర్ ఉద్యోగులకు నో.. వర్క్ ఇక్కడకు
ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఇప్పటికే అమెరికాలో స్థానికులను నియమించుకుంటున్నాయి. జూనియర్ ఉద్యోగులకు హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయవద్దని ఇన్ఫోసిస్ నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాలుగేళ్ల కంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగికి దరఖాస్తు చేయబోమని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. భారత్కు ఆఫ్షోర్ వర్కింగ్ కోసం అక్కడి క్లయింట్స్తో మాట్లాడుతున్నామని, జూనియర్ ఉద్యోగులు చేసే వర్క్ను భారత్కు తరలించే అవకాశాలు పరిశీలిస్తుననట్లు చెబుతున్నారు.
కొత్త రూల్స్ ప్రభావం తాత్కాలికమేనా
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలో హెచ్1బీ వీసాలపై మినిమం వేజ్ రిక్వైర్మెంట్ను 60,000 డాలర్ల నుండి 130,000 డాలర్లకు పెంచారు. ఈ నెల ప్రారంభంలో హెచ్1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ను అమెరికా నిలిపివేసింది. ఇది భారత ఐటీ మార్కెట్కు దెబ్బ. అయితే ఎన్నికల నేపథ్యంలో ట్రంప్ తీసుకువచ్చిన పలు హెచ్1బీ రూల్స్ తాత్కాలికమేనని, ప్రభావం కూడా స్వల్పమేనని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.