బిట్ కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదీ లేదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ
బిట్ కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదీ కూడా ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. క్రిప్టోపై బిల్లు వస్తుందనే వార్తల నేపథ్యంలో నేడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యా.యి. ఈ సందర్భంగా లోకసభకు ఇచ్చిన సమాధానంలో బిట్ కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ పైన ప్రభుత్వం ఎలాంటి డేటాను సేకరించడం లేదన్నారు.
'దేశంలో బిట్ కాయిన్ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం వద్ద ఉందా' అని ప్రశ్నించగా, 'లేదు సర్' అని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.
బిట్ కాయిన్ ఓ డిజిటల్ కరెన్సీ. ఇది ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి, సేవలు, బ్యాంకుతో సంబంధం లేకుండా మనీ ఎక్స్చేంజ్ వంటి వాటికి ఉపయోగపడుతుంది. బిట్ కాయిన్ 2008లో ప్రోగ్రామర్స్ గ్రూప్ ద్వారా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థగా పరిచయమైంది. ఎలాంటి మధ్యవర్తి లేకుండా పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించిన మొదటి డీసెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీ.
ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021ను తీసుకు వచ్చే ఆలోచన చేస్తోంది. అధికారిక డిజిటల్ కరెన్సీకి అనుమతి కోరుతున్న ఆర్బీఐ, ఇతర ప్రయివేటు క్రిప్టోలను నిషేధించాలని కోరుతోంది.
ఆర్థికమంత్రి మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో మంత్రిత్వ శాఖలు, విభాగాలు రూ.2.29 లక్షల కోట్లను మూలధన వ్యయంగా ఖర్చు చేసినట్లు తెలిపారు. బడ్జెట్ అంచనాల్లో (రూ.5.54 లక్షల కోట్లు) ఇది 41 శాతం.