Union Budget 2022: హల్వా వేడుకకు బదులు మిఠాయిల పంపకం
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి కారణంగా ఈ ఏడాది ఆర్థిక శాఖ దీనిని పక్కన పెట్టింది. అయితే హల్వా వేడుక లేకపోయినప్పటికీ, దానికి బదులుగా మిఠాయిలు (స్వీట్లు) పంచుతున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో గురువారం తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ కేంద్రం హల్వా వేడుకకు దూరం జరిగింది. అదే సమయంలో స్వీట్లు పంచుతుంది. హల్వా తయారీ సంరంభం లేకుండా బడ్జెట్ ప్రక్రియను చేపట్టడం మొదటిసారి.
కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకున్న సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి ఆధ్వర్యంలో హల్వా వేడుకను నిర్వహిస్తారు. బడ్జెట్ రూపకల్పన కోసం కొద్ది రోజుల పాటు కార్యాలయం నుండి బయటకు రాని ఉద్యోగులకు మిఠాయి సరఫరా చేసే ఉద్దేశ్యంలో భాగంగా హల్వా తయారు చేస్తారు. దీనిని అందరూ కలిసి భుజిస్తారు. బడ్జెట్ తయారీ సమయంలో దీనిని తయారు చేసే ఉద్యోగులు బయట ఎవరితోను మాట్లాడకూడదు. వీరంతా నార్త్ బ్లాక్లో ఉంటారు. ఇక్కడే బడ్జెట్ను ప్రింట్ చేస్తారు. ఆర్థికమంత్రి బడ్జెట్ను సమర్పించిన తర్వాత వీరు నార్త్ బ్లాక్ నుండి బయటకు వస్తారు. అయితే బడ్జెట్ రూపకల్పన తుది దశకు చేరుకున్న తర్వాత ఆర్థికమంత్రితో కలిసి హల్వా వేడుక ఉంటుంది. ఈసారి దానిని ఉపసంహరించుకున్నారు.
హల్వా వేడుక అంటే బడ్జెట్ ప్రక్రియ చివరి దశను సూచిస్తుంది. ఈ హల్వా వేడుకను నార్త్ బ్లాక్ బేస్మెంట్లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తారు. ఆర్థికమంత్రి సంప్రదాయంగా కడాయిని కదిలించడం ద్వారా ప్రారంభిస్తారు. కొద్ది రోజులు లేదా నెలల తరబడి సాగే సుదీర్ఘ బడ్జెట్ ప్రక్రియలో పాల్గొన్న సిబ్బంది ప్రయత్నాలను గుర్తించి, ప్రశంసించే ప్రయత్నంగా హల్వా వేడుకను నిర్వహిస్తారు. కీలక పత్రం తయారీలో పాల్గొన్న వారందరికీ హల్వే వడ్డిస్తారు.