తెలుగు రాష్ట్రాలు సహా ఈ స్కీం: అదనంగా రూ.23,523 కోట్ల రుణాలకు అనుమతి
కరోనా వైరస్ నేపథ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా ఆర్థిక వనరుల సమీకరణ కోసం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో 2 శాతం అదనపు రుణాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా కేంద్రం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానం తీసుకు వచ్చింది. దీనిని తొలుత 9 రాష్ట్రాలు అమల్లోకి తీసుకు వచ్చాయి. దీంతో ఆయా రాష్ట్రాలు రూ.23,523 కోట్లు అదనంగా అప్పులుగా తీసుకునేందుకు అనుమతించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత్లో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ, కఠిన సంస్కరణలు కష్టం: అమితాబ్ కీలకవ్యాఖ్య
తెలుగు రాష్ట్రాలు సహా...
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్న 9 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, గోవా, హర్యానా, కర్ణాటక, కేరళ, త్రిపుర, ఉత్తర ప్రదేశ్ ఉన్నాయి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు విధానం ద్వారా గరిష్టంగా ఉత్తర ప్రదేశ్ రూ.4,841 కోట్ల మేర అప్పులు తీసుకునే వెసులుబాటు ఉంది. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు ఆ తర్వాత ఉన్నాయి. రాష్ట్రాలు అదనంగా అప్పు తీసుకోవడానికి 2020 డిసెంబర్ 31 వరకు గడువు ఉందని తెలిపింది. ఈ లోపు మరిన్ని రాష్ట్రాలు ఇందులో చేరుతాయని భావిస్తున్నారు.
ఏ రాష్ట్రం వాటా ఎంత?
ఆంధ్రప్రదేశ్ రూ.2525 కోట్లు, గోవా రూ.223 కోట్లు, గుజరాత్ రూ.4352 కోట్లు, హర్యానా రూ.2146 కోట్లు, కర్నాటక రూ.4509 కోట్లు, కేరళ రూ.2261 కోట్లు, తెలంగాణ రూ.2508 కోట్లు, త్రిపుర రూ.148 కోట్లు, ఉత్తర ప్రదేశ్ రూ.4851 కోట్లుగా ఉంది. ఈ రాష్ట్రాలన్నింటికి కలిపి అదనంగా రూ.23,523 కోట్లు తీసుకునే వెసులుబాటు కలిగింది.
ఈ షరతుల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు
కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలకు ఆదాయం భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిధికి మించి అప్పు తీసుకోవడానికి కేంద్రం షరతులు విధించింది. ఇందులో భాగంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఒకటి. ఈ విధానం అమలు చేయడం ద్వారా జీఎస్టీడీపీలో 0.25 శాతం అదనంగా రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సంస్కరణలు వంటివి అమలు చేయడం ద్వారా మరిన్ని రుణాలు తీసుకునే వీలు కల్పించింది.