ఫ్లిప్కార్ట్, అమెజాన్ లకు ధీటుగా కిరాణా షాపులు
కిరాణా షాపులు... ఇంటి పక్కనే ఉంటూ మనకు అవసరమైన అన్ని వస్తువులను సమకూరుస్తూ ఎనలేని సేవలు అందిస్తున్నాయి. అంతే కాదు, మన దగ్గర డబ్బులు లేకున్నా రేపో ... మాపో ఇస్తామన్నా... నవ్వుతూ సరుకులు ప్యాక్ చేసి ఇస్తారు దుకాణ యజమానులు. కొంచెం ఎక్కువ సరుకులు తీసుకొంటే ఇంటికే తెచ్చి ఇచ్చి వెళతారు. పొద్దున్న లేస్తే పాల నుంచి పేస్ట్ వరకు, పప్పు నుంచి సబ్బుల వరకు అన్నిటికీ వీటిపై ఆధారపడతాం. అయితే, కొంత కాలంగా వీటికి పెద్ద కష్టం వచ్చి పడింది. విపరీతమైన ఆఫర్లు ప్రకటించే ఈ కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ల ధాటికి ఇవి బతికి బట్టకట్టే పరిస్థితి నానాటికీ తగ్గిపోతోంది.
దీంతో వినియోగదారులు పక్క కిరాణా కొట్టును వదిలేసి ... అన్నీ ఆన్లైన్ లో బుక్ చేస్తున్నారు. ఇక్కడ వీటికి పోటీ కేవలం ఆఫర్లే. దేశ జనాభాలో ఇలాంటి షాపుల పై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. కానీ ఇన్ని కోట్ల మంది నోట్లో మట్టి కొట్టీ రెండు మూడు కంపెనీల కంటే కూడా వీటిని బతికించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఇదే విషయాన్నీ హైలైట్ చేస్తూ దేశ వ్యాప్తంగా ట్రేడర్స్ బాడీ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తోంది. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు అందజేస్తూ వాటిని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకొనేలా ప్రయత్నిస్తోంది. దీని ఫలితంగా ప్రభుత్వం ప్రస్తుతం దేశంలోని కిరాణా షాపులు, చిన్న స్టోర్లను కాపాడే ప్రణాళికలు రచిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే ... మన పొరుగునే ఉండే కిరాణా కొట్టులు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లకు ధీటుగా మారనున్నాయి.
మారిన ఆధార్ కార్డు రూల్: బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చాలా ఈజీ
డిజిటల్ రూపు...
దేశవ్యాప్తంగా ఉన్న కిరాణా కొట్టులను అన్ని రకాలుగా సమర్థవంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ పేమెంట్ చెల్లింపులు, వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు, తక్కువ వడ్డీకి రుణాలు, డిజిటల్ హంగులు సమకూర్చాలని భావిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే పని ప్రారంభించింది. నేషనల్ రిటైల్ ఫ్రేమ్ వర్క్ పేరుతో కొత్త నిబంధనలు రూపొందిస్తోంది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. రిటైల్ వ్యాపారం రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి .... ఈ ఫ్రేమ్ వర్క్ ను రాష్ట్రాలు అమలు చేసేలా చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా లైసెన్స్ విధానం, రూల్స్ అమల్లో ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో షాప్స్ అండ్ ఎస్టాబ్లిషమెంట్స్ ఆక్ట్ అమల్లో ఉంది. అలా కాకుండా దేశ వ్యాప్తంగా ఒకే తరహా విధానం ఉండాలని కేంద్రం భావిస్తోంది.
7 కోట్ల స్టోర్లు...
దేశవ్యాప్తంగా సుమారు 7 కోట్ల కిరాణా షాపులు, చిన్న స్టోర్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 25 కోట్ల మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. మొత్తం దేశ జీడీపీ లో సుమారు 15% వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం భారత్ జీడీపీ పరిమాణం 2.7 ట్రిలియన్ డాలర్లు (రూ 189 లక్షల కోట్లు) స్థాయిలో ఉంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఈ రంగం ప్రతి ఏటా సుమారు 15% వృద్ధిని నమోదు చేస్తోంది. అందుకే ఈ రంగాన్ని ఎలాగైనా బతికించాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం పొంచి ఉంటుందని, కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రుణాలకు ప్రభుత్వ గారంటీ...
కిరాణా స్టోర్లు డిజిటల్ సొబగులు సమకూర్చుకునేందుకు, సరుకుల కొనుగోలు కనీసం వర్కింగ్ కాపిటల్ అవసరాలకు అందించే సాఫ్ట్ లోన్ల కు రాష్ట్ర ప్రభుత్వాలు గారంటీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కొత్త నిబంధనలు రూపొందించే పనిలో నిమగ్నమైన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిఫైఐఐటి) ... ఒక్కో రాష్ట్రం లో ఎన్ని స్టోర్లు ఉన్నాయో లెక్కించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. కిరాణా షాపులకు అన్ని రకాల మద్దతు ఇచ్చేందుకు నేషనల్ ట్రేడ్ వెల్ఫేర్ బోర్డు ను బలోపేతం చేయాలనీ కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
తక్కువ శాతమే...
ఇండియా లో సుమారు 7 కోట్ల స్టోర్లు ఉన్నపటికీ... వాటిలో చాలా తక్కువ స్టోర్ల కు మాత్రమే డిజిటల్ సౌకర్యాలు ఉన్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ అల్ ఇండియా ట్రేడర్స్ (సిఏఐటి) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అంచనా ప్రకారం... దేశంలో కేవలం 35% స్టోర్ల కు మాత్రమే డిజిటల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మిగితా వాటికి ఈ సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అడ్డగోలు ఆఫర్లతో ఈ కామర్స్ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం కొనసాగిస్తున్నాయని అయన ఆరోపించారు. దీని వల్లే కిరాణా షాపులు పోటీ పడలేకపోతున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా... దేశీయ రిటైల్ రంగంలో సరళీకరణ, సంస్కరణలు తీసుకొచ్చే ప్రణాళికలో భాగంగానే ప్రస్తుత నేషనల్ రిటైల్ ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తున్నారు.