భూమ్మీది ప్రజలందరికీ ఉచితంగా: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాక్సీన్ను పలు దేశాలు, వివిధ ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్, మోడర్నా తదితర సంస్థలు తమ వ్యాక్సీన్ 90 శాతం నుండి 94 శాతం ఫలితాలు ఇచ్చాయని చెబుతున్నాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సీన్ పరీక్షల కోసం భారత్ చేరుకుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి కీలక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. కోవిడ్ 19 వ్యాక్సీన్ను ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని సూచించారు.
ఖర్చు వారే భరించాలి
కరోనా వ్యాక్సీన్ ఖరీదు ఎంత ఉంటుందో అప్పుడే చెప్పలేం. ఈ నేపథ్యంలో మూర్తి మాట్లాడుతూ... వ్యాక్సీన్ ప్రజల కోసం అవసరమని, దీనిని ఈ భూమ్మీద ఉన్న ప్రజలందరికీ ఉచితంగా అందించాలన్నారు. ఐక్య రాజ్య సమితి లేదా ఇండివిడ్యువల్గా ఒక్కో దేశం ఈ వ్యాక్సీన్ ఖరీదును తయారు చేసే కంపెనీలు లేదా దేశాలకు పరిహారంగా ఇవ్వాలన్నారు. ఐక్య రాజ్య సమితి, ఆయా దేశాలు వ్యాక్సీన్ ఖర్చు కోసం ఇవ్వాలని, కానీ వాటి లాభాల కోసం కాదన్నారు. తద్వారా ఇది లాభాలు చూసే సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఈ వ్యయాన్ని భరించేందుకు పెద్ద కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలన్నారు. ప్రధానంగా ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలు ఈ ఖర్చులో ప్రధాన భాగాన్ని పంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సీన్ను తాము ఉచితంగా పంపిణీ చేస్తామని బీహార్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనను గుర్తు చేశారు.
ఐటీ కంపెనీల వర్క్ ఫ్రమ్ హోమ్
కరోనా నేపథ్యంలో కంపెనీలు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం ఇస్తున్నాయి. శాశ్వత ప్రాతిపదికన ఇలా కొనసాగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పలు కంపెనీలు కూడా దీనిని పరిశీలిస్తున్నాయి. దీనిపై మూర్తి స్పందించారు. శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం సరికాదన్నారు. అలాగే, తగిన భద్రతా చర్యలతో పాఠశాలలు తిరిగి తెరవాలనే ఆలోచనకు ఆయన మద్దతు ఇచ్చారు.
భారత్కు 300 డోసులు
ఫైజర్, మోడర్నా సంస్థలు తమ వ్యాక్సీన్ 90 శాతం కంటే ఎక్కువ ఫలితాలు ఇచ్చిందని ప్రకటించాయి. వీటి ప్రకారం రెండు డోసులు ఇవ్వాలి. అంటే దేశంలోని 130 కోట్ల మందికి పైగా ప్రజలకు మొత్తం 300 డోసులు కావాలి. ఈ కంపెనీలు తయారు చేసే వ్యాక్సీన్లు భారత్కు సరిపోవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫైజర్ వ్యాక్సీన్ను మైనస్ 70 డిగ్రీల వద్ద స్టోర్ చేయాలి. ఇది భారత్, ఇతర పేద దేశాలకు కాస్త భారమే. అయితే మోడర్నా టీకాలను సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయవచ్చు. ఇది భారత్కు అనుకూలం.