భారత కుబేరుడు అంబానీయే, రెండో స్థానంలో అదానీ: భారత, ప్రపంచ బిలియనీర్లు వీరే
ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండియా జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. HCL టెక్నాలజీస్ చైర్మన్ శివ్నాడర్ మూడో స్థానంలో ఉన్నారు. గత ఏడాది కూడా ఫోర్బ్స్ 2022 జాబితాలో వీరు ముగ్గురు వరుసగా ఇదే స్థానంలో ఉన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం ముఖేష్ అంబానీ సంపద గత ఆర్థిక సంవత్సరం 7 శాతం పెరిగి 90.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మన కరెన్సీలో 6.8 లక్షల కోట్లు. ఆసియా కుబేరుడుగా, ప్రపంచంలోనే పదో బిలియనీర్గా ముఖేష్ అంబానీ ఉన్నారు.
టాప్ టెన్ వీరే
అంబానీ తర్వాత అదానీ 90 బిలియన్ డాలర్ల సంపదతో (రూ.6.75 లక్షల కోట్లు) రెండో స్థానంలో నిలిచారు. అంబానీ, అదానీలు వచ్చే దశాబ్ద కాలంలో గ్రీన్ ఎనర్జీ పైన భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నారు. మూడో స్థానంలో ఉన్న శివ్నాడర్ సంపద 28.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వ్యాక్సీన్ దిగ్గజం, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా సంపద 24.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈయన నాలుగో స్థానంలో ఉన్నారు. డీమార్ట్ అధినేత రాధాకిషన్ 20 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ 17.9 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో, ఓపీ జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్ 17.7 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార్ మంగళం బిర్లా 16.5 బిలియన్ డాలర్లతో ఎనిమిదో స్థానంలో, సన్ ఫార్మాస్యూటికల్స్ హెడ్ దిలీప్ శంగ్వీ 15.6 బిలియన్ డాలర్లతో తొమ్మిదో స్థానంలో, కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ 14.3 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో నిలిచారు.
166కు పెరిగిన బిలియనీర్లు
భారత్లో బిలియనీర్స్ సంఖ్య 144 నుండి 166కు పెరిగింది. గత ఏడాది చాలా కంపెనీలు ఐపీవోకు వచ్చాయని, 60 కంపెనీలు కలిసి 15.6 బిలియన్ డాలర్లు సమీకరించాయి. గత ఆర్థిక సంవత్సరం కరోనా కారణంగా చాలా కంపెనీలు డిజిటల్కు మారాయి. దీంతో ఐటీ రంగం రికార్డ్ స్థాయిలో 200 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో ఐటీ దిగ్గజం HCL టెక్ అధినేత శివ్నాడార్ సంపద 22 శాతం పెరిగింది. ఇక్కు ధరలు పెరగడంతో సావిత్రి జిందాల్ ఈ ఏడాది అగ్రగామి 10 మంది కుబేరుల జాబితాలో చేరారు. మొత్తం జాబితాలో 13 మంది మహిళలు కుబేరుల్లో సావిత్రి కూడా ఉన్నారు. కొత్తగా వచ్చిన 29 మందిలో పాల్గుణి నాయర్ కూడా ఉన్నారు. నైకా లిస్టింగ్ ద్వారా ఆమె ఈ స్థాయికి ఎదిగారు.
26 శాతం జంప్
166 మంది కుబేరుల సంపద గత ఏడాది 26 శాతం పెరిగి 750 బిలియన్ డాలర్లు లేదా రూ.56 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రపంచ బిలియనీర్స్లో టాప్ 12లో ముఖేష్ అంబానీతో పాటు అదానీ మాత్రమే ఉన్నారు. భారత్లో, ఆసియాలో అత్యధిక ధనికులు వీరిద్దరే.
ప్రపంచ కుబేరులు
ప్రపంచ కుబేరుల జాబితా విషయానికి వస్తే ఎలాన్ మస్క్ (288 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజోస్ (193 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ అర్నాల్ట్ (150 బిలియన్ డాలర్లు), బిల్ గేట్స్ (134 బిలియన్ డాలర్లు), లారీ పేజ్ (127 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (125 బిలియన్ డాలర్లు), సెర్జీ బ్రిన్ (122 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మర్ (110 బిలియన్ డాలర్లు), లారీ ఎలిశన్ (106 బిలియన్ డాలర్లు) ఉన్నారు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు నిలిచారు.