రిలయన్స్ మేరీ జాన్ హై: మోడీ ప్రకటనకు ముందే.. ముఖేష్ వ్యాపార సామ్రాజ్యంలోకి మరో వారసుడు
కరోనా మహమ్మారి సమయంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో ప్లాట్ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. ఫేస్బుక్, జనరల్ అట్లాంటిక్, విస్టా, కేకేఆర్ వంటి అంతర్జాతీయ టెక్, ఫండ్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జియో ప్లాట్ఫాంలోకి పెట్టుబడులు రావడం అదీ నెల రోజుల్లోనే 4, 5 పెద్ద పెట్టుబడులు రావడం గమనార్హం. ఇప్పుడు అంతకుమించిన వార్త వచ్చింది.

మోడీ ప్రకటనకు ముందే.. అకాశ్ అంబానీ ఎంట్రీ
ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ (25) అధికారికంగా కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలోకి వచ్చాడు. జియో ప్లాట్ఫామ్స్లో అదనపు డైరెక్టర్గా రిలయన్స్ సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో రిలయన్స్ ప్రకటన చేయనుందని తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని జియో ప్లాట్ఫామ్స్లోకి అదనపు డైరెక్టర్గా ఆరంగేట్రం చేశాడని వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తొలి విడత లాక్ డౌన్ ప్రకటించడానికి వారం ముందే ఈ పరిణామం చోటు చేసుకుందని కూడా చెబుతున్నారు. అధికారికంగా త్వరలో ప్రకటన రావొచ్చునని చెబుతున్నారు.

ఆకాష్, ఇషాలు 2014లోనే
అనంత్ తోబుట్టువులు ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ. వీరిద్దరు వ్యాపార బాధ్యతల్లో చురుగ్గా ఉన్నారు. 2014లోనే వీరిద్దరు రిలయన్స్ టెలికం, రిటైల్ బిజినెస్లలో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. కానీ ఇప్పటి వరకు ఆకాశ్ అంబానీ తన తల్లి నీతాతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ తమ జట్టు ముంబై ఇండియన్స్ను ఉత్సాపరిచేవారు.

రిలయన్స్ నా జీవితం..
గత ఏడాదిన్నర కాలంగా అనంత్ అంబానీకి బాధ్యతలు అప్పగించే దిశగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఐదు నెలల క్రితం తన తాత దీరుభాయ్ అంబానీ జన్మదినం సందర్భంగా అతి పిన్న వయస్కుడైన అనంత్ ముఖ్య ఉపన్యాసం (కీ నోట్ అడ్రస్) చేశారు. రిలయన్స్ కుటుంబానికి సేవ చేయడమే తన జీవితంలో అతి ముఖ్యమైన లక్ష్యమని చెప్పాడు. మార్పుకు భారత్ నాయకత్వం వహించాలని, రిలయన్స్ ఆ మార్పులో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. రిలయన్స్ మేరీ జాన్ హై (రిలయన్స్ నా జీవితం) అన్నారు.

అనంత్ అంబానీ గురించి క్లుప్తంగా..
అనంత్ అంబానీ ఎక్కువగా జామ్నగర్లో గడిపాడు. అతను ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు. 2017లో బ్రౌన్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన తల్లి నీతా అంబానీతో కలిసి సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటుంటాడు. గతంలో కేవలం 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడం సంచలనంగా మారింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం వీరి కుటుంబాన్ని కలిసినప్పుడు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీలో భాగమయ్యాడు. గత ఏడాది ముంబై వరదల సమయంలో రిలయన్స్ తరఫున రూ.5 కోట్ల విరాళం ఇచ్చేందుకు అనంత్ నాటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు వెళ్లాడు.


Click it and Unblock the Notifications