రిలయన్స్ ఎఫెక్ట్, ముఖేష్ అంబానీని దాటేసిన చైనీస్ కుబేరుడు జోంగ్ షంషాన్
బీజింగ్: 2020 క్యాలెండర్ ఏడాదిలో ఆసియా కుబేరుడి అవతారం నుండి వరల్డ్ టాప్ 10లోకి వచ్చిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అంతలోనే ఆ జాబితా నుండి ఔట్ అయ్యారు. తాజాగా ముఖేష్ను వెనక్కి నెట్టి చైనాకు చెందిన ఇండస్ట్రియలిస్ట్ ఆసియా కుబేరుడిగా నిలిచారు. చైనీస్ ప్రయివేటు బిలియనీర్ జోంగ్ షంషాన్ ఆసియా ధనవంతుడిగా నిలిచినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ఇటివలీ వరకు ఆసియా కుబేరుడిగా ఉన్న ముఖేష్ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు.
టాప్ 10 నుండి ముఖేష్ అంబానీ ఔట్.. అందుకే: 2020 రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండుగే!
ఆ రెండు కంపెనీల ప్రభావంతో
జోంగ్ షంషాన్కు చెందిన రెండు కంపెనీలు... వ్యాక్సీనే మేకర్ బీజింగ్ వాంతాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్ప్రైజెస్ కంపెనీ, నోంగు స్ప్రింగ్ కంపెనీలు 2020లో భారీగా ఎగిశాయి. దీంతో ఈ క్యాలెండర్ ఇయర్ చివరలో జోంగ్ షంషాన్... ముఖేష్ అంబానీ కంటే పైకి వచ్చారు. ఈ రెండు కంపెనీలు వరుసగా 155 శాతం, 2000 శాతం పైకి ఎగిశాయి. దీంతో జోంగ్ షంషాన్ నికర ఆదాయం 77.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో అతని సంపద 70.9 బిలియన్ డాలర్లుగా ఉంది. జోంగ్ షంషాన్... చైనాకు చెందిన అలీబాబా అధినేత జాక్ మాను కూడా అధిగమించాడు.
అందుకే ముఖేష్ ఔట్
జోంగ్ షంషాన్ అత్యంత వేగంగా ఆసియా కుబేరుడిగా అవతరించారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్.. గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అయినప్పటికీ ఇటీవల రిలయన్స్ స్టాక్ పడిపోవడంతో ముఖేష్ ఆస్తులు క్షీణించి, ఆసియా కుబేరుడి స్థానం కోల్పోయారు. ముఖేష్ నికర ఆస్తులు 18.3 బిలియన్ డాలర్లు క్షీణించడంతో 76.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది రిలయన్స్ స్టాక్ రూ.2370ని తాకినప్పటికీ ఇప్పుడు రూ.2000 దిగువనే ఉన్నాయి. ఈ ప్రభావం ఆదాయంపై ప్రభావం చూపింది.
అలీబాబా ఆస్తులు
ఇక, అలీబాబా సహ వ్యవస్థాపకులు జాక్ మా నికర ఆదాయం అక్టోబర్ చివరి నుండి 11 బిలియన్ డాలర్లు తగ్గింది. దీంతో 61.7 బిలియన్ డాలర్ల నుండి 50.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. జోంగ్ షంషాన్ ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానంలో ఉన్నారు. జాక్ 25వ స్థాంలో నిలిచారు. ఇక కొద్ది నెలల క్రితం ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ఇటీవల టాప్ 10 నుండి పడిపోయారు.