ముఖేష్ అంబానీని వరించిన COP28 సభ్యత్వం.. ఈ ఐక్యరాజ్యసమితి కమిటీ ఏం చేస్తుందంటే..
Ambani: దేశంలో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ ఘనత వెనుక కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కృషి ఎంతగానో ఉంది. వివిధ కఠిన పరిస్థితులను సైతం ధీటుగా ఎదుర్కొంటూ, సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చారు. అందుకే ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేసే అవకాశం ఆయనను వరించింది.
వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ (UNFCCC) 28వ సెషన్ ఆఫ్ పార్టీస్ (COP28) అధ్యక్షుడి సలహా కమిటీలో సభ్యునిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ నియమితులయ్యారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ జనరల్ సునీతా నరైన్ మరియు అంబానీ మాత్రమే ఈ కమిటీలో భారతీయులు కావడం విశేషం.
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది UNFCCC యొక్క అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవటానికి UNFCCC స్థాపించబడింది. పర్యావరణం మరియు అభివృద్ధిపై 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్లో దీని కోసం సంతకం చేయబడింది. ఈ సమావేశాన్నే రియో సమ్మిట్ లేదా ఎర్త్ సమ్మిట్ గా కూడా పిలుస్తారు. UNFCCC సెక్రటేరియట్ జర్మనీలోని బాన్లో ఉంది.
పాలసీలు, పరిశ్రమలు, ఇంధనం, ఆర్థిక, పౌర సమాజం, యువత మరియు మానవతావాద చర్యలకు ఈ COP ప్రాతినిధ్యం వహిస్తుంది. కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 31 కాగా.. వీరిలో 65 శాతం మంది గ్లోబల్ సౌత్ కు చెందినవారు. వీరంతా COP ప్రెసిడెన్సీకి దిశానిర్దేశం చేస్తూ, సలహాలను అందిస్తారు. ఈ ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబరు 12 వరకు దుబాయ్ ఎక్స్ పో సిటీలో COP 28వ సెషన్ జరగనుంది.
రిలయన్స్ చీఫ్ అంబానీ సభ్యునిగా ఉన్న COP28 అడ్వైజరీ కౌన్సిల్ లో పలువురు ఇతర ముఖ్యమైన ప్రపంచ నాయకులు సైతం ఉన్నారు. బ్లాక్ రాక్ ఛైర్మన్ & CEO లారీ ఫింక్, ఆర్కిటిక్ సర్కిల్ ఛైర్మన్ ఒలాఫర్ గ్రిమ్సన్, పారిస్ అగ్రిమెంట్ ప్రెసిడెంట్ లారెంట్ ఫాబియస్, డైరెక్టర్ జనరల్ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ (IRENA) ఫ్రాన్సిస్కో లా కెమెరా, ఆయిల్ అండ్ గ్యాస్ క్లైమేట్ ఇనిషియేటివ్ (OGCI) ఛైర్మన్ బాబ్ డడ్లీలు ఈ జాబితాలో కొనసాగుతున్నారు.