24 బిలియన్ డాలర్లతో అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ, ఇండియా 'అలీబాబా' ముఖేష్ అంబానీ
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. డిజిటల్ సేవల రంగంలో ఆయన అలీబాబా, అల్ఫాబెట్ మార్గాన్ని ఎంచుకున్నారు. అలీబాబా గ్రూప్ చైనాలో ఈ-కామర్స్, క్లౌండ్ కంప్యూటింగ్ సహా వివిధ టెక్నాలజీ సేవల కోసం ప్రత్యేక హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసింది. గూగుల్ కూడా అల్ఫాబెట్ పేరుతో మాతృసంస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు భారత్లో ఈ-కామర్స్, డిజిటల్ సేవల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. 24 బిలియన్ డాలర్లతో ఇందుకు డిజిటల్ సేవలకు సిద్ధమవుతున్నారు.
ఆరేళ్లలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లిన ఆదాయమెం
హోల్డింగ్ కంపెనీ
ఇందులో భాగంగా డిజిటల్ సేవల కోసం ప్రత్యేక హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. భారత మార్కెట్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్కు పోటీగా ఈ-కామర్స్ వ్యాపారాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్న ముఖేష్ అంబానీ ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తున్నారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్తో పాటు ఇతర డిజిటల్ సేవల విభాగాలను ఈ హోల్డింగ్ కంపెనీ ద్వారా నిర్వహిస్తారు.
1.08 లక్షల కోట్లకు ఆమోదం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు అనుబంధ విభాగంగా ఈ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు అవుతుంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో రూ.1.08 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మొత్తానికి ఇప్పటికే రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని హోల్డింగ్ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేయనుంది.
డెబిట్ రహిత జియో
దాంతో 2020, మార్చి నాటికి జియో రుణరహిత కంపెనీగా మారుతుంది. జియో ఇప్పటికే రూ.65,000 కోట్ల మూలధనం కలిగి ఉంది. రానున్న అయిదేళ్లలో రిలయన్స్ జియోతోపాటు రిటైల్ వ్యాపారాన్ని పబ్లిక్ ఆఫరింగ్ (IPO)కు తీసుకు రానున్నట్లు ఆగస్ట్లో జరిగిన వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ తెలిపారు. ఐపీఓ వ్యూహాల్లో భాగంగా జియోను పూర్తి రుణరహిత కంపెనీగా మారుస్తున్నట్లు, వ్యూహాత్మక ఇన్వెస్టర్ల పాలిట సంస్థను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నట్లు చెబుతున్నారు.
అతిపెద్ద డిజిటల్ సేవల ప్లాట్ ఫామ్
రిలయన్స్ ఏర్పాటు చేయబోయే ఈ హోల్డింగ్ కంపెనీ దేశంలో అతిపెద్ద డిజిటల్ సేవల ప్లాట్ ఫామ్ కానుంది. ఈ సంస్థ విద్య, వైద్య సంబంధిత సాంకేతికతలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, వర్చువల్ అండ్ అగ్మెంటెడ్ రియాల్టీ వంటి ఆధునిక టెక్నాలజీపై దృష్టి సారిస్తుంది. ఈ హోల్డింగ్ కంపెనీ ఆధ్వర్యంలో మైజియో, జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సావన్ వంటి డిజిటల్ యాప్స్ ఉండనున్నాయి.